'ఉబేర్' డ్రైవర్ల ధర్నా: అతను సైకోటిక్ క్రిమినల్, కాలేజ్ యువతిపైనా..
ఢిల్లీ: ఉబేర్ సంస్థ క్యాబ్లపై నిషేధం విధించడం పట్ల ఆ సంస్థ క్యాబ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కరు చేసిన తప్పుకు ఇంతమంది అమాయక డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేయడం తగదని వారంతా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఉబెర్ క్యాబ్ సర్వీసులపై నిషేధాన్ని ఎత్తివేయాలని క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నిషేధం వల్ల తమ కుటుంబాలు గడవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉబెర్ సంస్థ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేసి సొంత వాహనాలను కొనుక్కునేలా ప్రోత్సహించిందని రంజిత్ రాయ్ అనే డ్రైవర్ వివరించాడు. ఓ ఉద్యోగినిపై ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అత్యాచారానికి పాల్పడటంతో ఆ సంస్థ క్యాబ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
సైకోటిక్ క్రిమినల్
శివకుమార్ యాదవ్ సైకోటిక్ క్రిమినల్ అని అతనిని విచారిస్తున్న పోలీసులు చెప్పారు. అంతేకాకుండా నిత్యం అబద్దాలు ఆడుతుంటాడని చెప్పారు. గుర్గావ్లోని సహారా మాల్ నుండి దక్షిణ ఢిల్లీకి తన క్యాబ్లో వెళ్లే పలువురిని అతను టార్గెట్ చేశాడని చెప్పారు.
తాను క్రిమినల్గా వ్యవహరిస్తున్నట్లు అతను ఎప్పుడు భావించలేదని చెప్పారు. మహిళల పైన లైంగిక వేధింపులు, ఇతర తన క్రిమినల్ చర్యలను అతను ఎప్పుడు కూడా జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. అతను వివిధ రకాల స్టేట్మెంట్లు ఇచ్చాడని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇతని పైన మరికొన్ని ఫిర్యాదులు అందితే, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. 2011లో గుర్గావ్ నుండి దక్షిణ ఢిల్లీకి వెళ్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు ఓ ప్రయాణికురాలు ఆరోపించిందని, అయితే, ఆధారాలు లేనందున ఇతను తప్పించుకున్నాడని చెప్పారు.
ఎందరి పైనో..
ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ గత చరిత్రను విచారిస్తుంటే పోలీసులే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శివకుమార్ తమను అత్యాచారం చేశాడంటూ 6 ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. తనను ఆంటీ అని పిలుస్తూ ఓ రోజు రాత్రి శివకుమార్ తనపై అత్యాచారం చేశాడని, బయటకు చెబితే కుటుంబ పరువు పోతుందని బాధను దిగమింగానని 46 ఏళ్ల మహిళ ఒకరు వాపోయారు.
రాంనగర్ పరిధిలో మరో ఇద్దరు యువతులపై కూడా శివకుమార్ అత్యాచారం చేశాడని తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు శివకుమార్ పై కేసు పెట్టగా, అది ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. 2011లో గుర్గావ్లో బార్ డాన్సర్ పైన అత్యాచారం సహా అతనిపై ఇప్పుడు మొత్తం 6 కేసులు ఉన్నాయి.
మరో మహిళ తన బాధను చెబుతూ.. 2013లో ఇదే శివకుమార్ గన్ పాయింట్ సమీపంలో అత్యాచారం చేశాడని వివరించింది. అతను ఆంటీ అని పిలిచే మహిళను, ఓ కాలేజ్ యువతి పైన కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఇప్పుడా కేసులన్నింటినీ తిరగదోడే పనిలో ఉన్నారు.