Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీబీఐకి గడ్డకాలమే: పతనావస్థలో ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ: తప్పెవరిది?

న్యూఢిల్లీ: మనదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రాజకీయ చదరంగంలో అచ్చం పావులా మారింది దాని పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లను బారిన పడింది. అంపశయ్యపై శయనించింది. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులూ సీబీఐని ఆకాశానికి ఎత్తేసిన రాజకీయ నాయకులు..అధికారంలోకి రాగానే తమ ప్రతాపం చూపుతున్నారు. సీబీఐని పీక నులిమేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ- పశ్చిమ బెంగాల్. కేసు విచారణలో భాగంగా.. పశ్చిమ బెంగాల్ లో అడుగు పెట్టిన సీబీఐ అధికారులను అడ్డుకున్న అక్కడి పోలీసులు.. ఏకంగా నేరస్తుల తరహాలో వారిని జీపు ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు.

మసకబారి..పతనావస్థకు చేరి..

మసకబారి..పతనావస్థకు చేరి..


ఏ దేశానికైనా సరే. ఓ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఉంటుంది. ఉండి తీరాలి కూడా. అమెరికాలో ఎఫ్ బీఐ, రష్యాలో కేజీబీ..ఇలా దాదాపు అన్ని దేశాలూ అత్యున్నత దర్యాప్తు సంస్థలను నెలకొల్పాయి. మనదేశంలో సీబీఐ కూడా ఇలాంటి దర్యాప్తు సంస్థే. రాజకీయాలకు అతీతంగా, స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి అలాంటి సంస్థలు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ తలొగ్గవు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తాయి. తప్పు చేస్తే తాటతీస్తాయి. దోషిగా తేలిన వారు ఎలాంటి వారైనా గానీ వదిలిపెట్టవు. అలాంటి సీబీఐ ప్రతిష్ఠ కొన్నేళ్లుగా మసకబారుతూ వస్తోంది. తన ప్రాభవాన్ని, గత కాలపు వైభవాన్నీ క్రమంగా కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు పతనం అంచున నిలిచింది.

వెన్నెముక లేకపోతే ఎలా?

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు.. సీబీఐ పతనానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న నాయకులు చెప్పిన ప్రతి మాటకూ తల ఊపింది. వారి ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించింది. ఫలానా నాయకుడిపై నమోదు చేసిన కేసులు నిలుస్తాయా? లేవా? అని సొంత బుర్రతో ఆలోచించలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఏది చెబితే.. అది చేసుకుంటూ వెళ్లిందే తప్ప ఎదురు చెప్పలేకపోయింది. ఇలా తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది.

జగన్ ఆస్తుల కేసుతో చేతులు కాల్చుకుందా?

జగన్ ఆస్తుల కేసుతో చేతులు కాల్చుకుందా?

మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కేసు ఒక్కటే చాలు.. సీబీఐ ఏ స్థాయిలో పనిచేసిందనడానికి. 2012లో అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్మీనారాయణ ఈ కేసులో అతి కీలకమైన వ్యక్తి. జగన్ పై 11 కేసులను నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆయనను 16 నెలల పాటు జైలులో ఉంచారు. దాదాపు ఏడేళ్లు గడిచిన తరువాత కూడా జగన్ పై ఒక్క కేసును కూడా సీబీఐ నిరూపించలేకపోయింది. 11 ఛార్జీషీట్లకు గాను పదింటిని న్యాయస్థానాలు కొట్టేశాయి కూడా. ఈ కేసులో విచారణను ఎదుర్కొన్న సీనియర్ ఐఎఎస్ అధికారులు ఒక్కొక్కరుగా నిర్దోషులుగా బయటికి వచ్చారు.

ఈ కేసుతో సీబీఐ ప్రతిష్ఠ మసకబారింది. తాము చెప్పినట్టు విని ఉంటే.. జగన్ జైలుపాలయ్యేవాడు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఓ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాటను ఉటంకించారు. జగన్ ను నియంత్రించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం సీబీఐని ఉద్దేశపూరకంగా, రాజకీయ కారణాల నేపథ్యంతోనే ప్రయోగించిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. జగన్ ను అరెస్టు చేయడం, ఆయనను జైలుకు తరలించిన ఘటనతో అటు జేడీ లక్ష్మీ నారాయణ గానీ, ఇటు సీబీఐ గానీ రాష్ట్ర ప్రజల్లో హీరోలుగా గుర్తింపు పొందాయి.

మోడీ హయాంలోనూ అదే దాడి?

కేంద్రంలో అధికార మార్పిడి తరువాత సీబీఐ మరింత ఇక్కట్లను ఎదుర్కొన్నదనే వార్తలు ఉన్నాయి. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందనేది విశ్లేషకుల వాదన. తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడానికి బీజేపీ కూడా సీబీఐని ఇష్టానుసారంగా వాడుకుంటోందని విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వారు దీనికి ఉదాహరణగా చూపుతున్నారు.

నిజానికి- రోజ్ వ్యాలీ, శారద ఛిట్ ఫండ్ కుంభకోణాలు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్నవి. వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన బాధ్యతను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. సీబీఐకి అప్పగించింది. ఈ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ అధికారులు కోల్ కతకు చేరుకున్నారు. ఆయా కుంభకోణాలకు సంబంధించిన కీలక పత్రాలు గల్లంతు కావడం వెనుక కోల్ కత పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించాలనే ఉద్దేశంతో వచ్చిన సీబీఐ అధికారులను మమత బెనర్జీ అడ్డుకోవడంతో ఉద్రిక్త నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం వల్లే సీబీఐ అధికారులు కోల్ కత వచ్చారని అనుకోవడానికి వీల్లేదు. పశ్చిమ బెంగాల్ ను కుదిపేసిన కుంభకోణాల వెనుక అసలు దోషులను వెలుగులోకి తీసుకుని రావాలని సుప్రీంకోర్టు చేసిన ఆదేశాల మేరకే వారు వెళ్లాల్సి వచ్చింది.

మమత చూపిన దారిలో నడిస్తే.. పరిస్థితేంటీ?

మమత చూపిన దారిలో నడిస్తే.. పరిస్థితేంటీ?

విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను అడ్డగించి, వారిని పోలీస్ స్టేషన్ కు తరలించిన మమతా బెనర్జీ ఓ సరికొత్త వివాదానికి, సంప్రదాయానికి తెర తీశారు. బీజేపీయేతర పార్టీలన్నీ అదే సంప్రదాయాన్ని పాటిస్తే పరిస్థితేమిటనేది చర్చనీయాంశమౌతోంది. ఏపీలో సీబీఐ అధికారులు అడుగు కూడా పెట్టకుండా నిషేధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విచారణకు వచ్చిన అధికారులను నిర్బంధించారు మమతా బెనర్జీ. ఈ రెండు రాష్ట్రాలూ బీజేపీయేతర పార్టీల చేతుల్లో ఉన్నవే. మున్ముందు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ వంటి చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి వాతావరణంలో సీబీఐ తన మనుగడను ఎలా కొనసాగించగలుగుతుంది? తన ఉనికిని ఎలా చాటుకోగలుగుతుంది? బీజేపీయేతర పార్టీల రాష్ట్రాల్లో సీబీఐ ఎలా అడుగు పెట్టగలుగుతుంది?

తన గొయ్యిని తానే తవ్వుకునట్టే..

అసలే పరువు పోయి, ప్రజల్లో అభాసుపాలైన సీబీఐని సొంత కుంపటి కూడా కొంపముంచింది. అలోక్ వర్మ, అస్థానా ముడుపుల బాగోతం సీబీఐని అథ:పాతాళానికి తొక్కేశాయి. సీబీఐలో నంబర్ వన్, నంబర్ టూ మధ్యే ముడుపుల ఆరోపణలు రావడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఆ సంస్థ నవ్వులపాలైంది. ఒకప్పుడు ప్రజల్లో హీరోగా వెలిగిన సీబీఐ.. ఇప్పుడు చులకనకు గురైంది. ఓ రకంగా చెప్పాలంటే.. తన గొయ్యిని తానే తవ్వుకొంది.

మమత చూపిన బాటలో..

మమత చూపిన బాటలో..

సీబీఐ మనుగడే ప్రశ్నార్థకమైన ప్రస్తుత పరిస్థితుల్లో నేరస్తులు చెలరేగిపోవడానికి అవకాశం ఇచ్చినట్టే. వారంతా రాజకీయ పార్టీల తీర్థం పుచ్చుకుని, నేరాలకు పాల్పడితే.. గతేం అవుతుంది? సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వాలే అడ్డుపడితే ప్రజలకు జవాబుదారీగా ఎవరుంటారు? శారద, రోజ్ వ్యాలీ తరహా కుంభకోణాలు ప్రతి రాష్ట్రంలోనూ చోటు చేసుకుంటే సామాన్యులను ఎవరు ఆదుకుంటారు? పశ్చిమ బెంగాల్ తరహాలోనే మన రాష్ట్రంలోనూ అగ్రిగోల్డ్ కేసు నడుస్తోంది. ఆ కేసులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద తలకాయలు ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ తలెత్తింది. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లి.. వాళ్లు మన రాష్ట్రానికి వస్తే.. చంద్రబాబు ఊరుకుంటారా? మమత బెనర్జీ చూపించిన దారిలో నడవరూ? అగ్రిగోల్డ్ బాధితుల వైపు నిలవాల్సిన ప్రభుత్వం.. ప్రతిష్ఠకు పోయి, సీబీఐని అడ్డుకోదా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడిప్పుడే దొరకడం కష్టం.

ఈడీనీ అడ్డుకుంటారా?

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గానీ, సీఎం రమేష్ ఇళ్లపై ఇప్పటికే ఈడీ ఓ మారు దాడి చేసింది. సోదాలను నిర్వహించింది. ఈ సారి ఈడీ అధికారులు మన రాష్ట్రంలోకి వచ్చినా చంద్రబాబు అడ్డుకోరన్న గ్యారంటీ లేదు. చంద్రబాబు గానీ, సుజనా చౌదరి గానీ, సీఎం రమేష్ గానీ.. ఈడీ సోదాలను బీజేపీకే అంటగడతారనడంలో సందేహాలు అక్కర్లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+