లాలూపై కేసును తిరగదోడిన CBI.. వెనక ఎవరు?
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పై ఉన్న కేసును సీబీఐ తిరగదోడింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. బీహార్ లో జేడీయూతో ఆర్జేడీ పొత్తు పెట్టుకున్న కొద్దినెలల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
యూపీఏ-1 హాయంలో లాలూప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ 2021లో ముగిసిపోయింది. ఈ ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదవలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో లాలూప్రసాద్ యాదవ్ తోపాటు బీహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ కూడా నిందితులుగా ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్య కారణాలవల్ల బెయిల్పై ఉన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందారు. ఆయన కుమార్తె కిడ్నీ దానం చేయడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఆగస్టులో బీజేపీతో బంధం తెంచుకున్న నీతీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేశారు. ఈ రెండు పార్టీల మద్దతుతో నితీష్ మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా తేజస్వి యాదవ్ కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.