వ్యాక్సిన్ పై కేంద్రం తాజా నిబంధన-కోలుకున్న మూడు నెలల తర్వాతే ఏ డోసైనా
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఓ కొత్త నిబంధన పంపింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కూడా సూచించింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఈ నిబంధన ప్రాధాన్యం సంతరించుకుంది.
ల్యాబ్ లో కరోనా నిర్ధారణ అయ్యాక సదరు రోగికి తప్పనిసరిగా మూడు నెలల వ్యవధి తర్వాతే వ్యాక్సిన్ ఇచ్చేలా నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్.. కోవిడ్ అనారోగ్యంతో ఉన్న అర్హులైన వ్యక్తులకు ప్రస్తుతం ఇస్తున్న ప్రికాషనరీ డోస్ (ముందు జాగ్రత్త డోస్ ) కు సంబంధించి కేంద్రం జోక్యం కోరుతూ భారీగా అభ్యర్థనలు వచ్చాయని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన కేంద్రం... కోవిడ్ సోకిన వారికి ప్రికాషనరీ డోస్ తో పాటు కరోనా రెగ్యులర్ డోస్ లు కూడా మూడు నెలల వరకూ ఇవ్వరాదని నిర్ణయించింది. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు కూడా సూచించింది.
వాస్తవానికి కరోనా టీకాలు కనిపెట్టిన కొత్తలోనే అవి కోవిడ్ సోకిన వారికి ఇచ్చి ప్రయోజనం లేదని వాటి తయారీ సంస్ధలే తేల్చేశాయి. కోవిడ్ టీకాలు కేవలం వైరస్ సోకని వారికి లేదా, సోకి చాలా కాలం అయిన తర్వాత మరోసారి సోకకుండా జాగ్రత్త పడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని తేలింది. కానీ ప్రస్తుతం వైరస్ విజృంభణ నేపథ్యంలో కోవిడ్ సోకడంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ప్రికాషనరీ డోస్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వారికి ఇస్తున్న టీకాలు కూడా వృథా పోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.