పౌరసత్వ సవరణ బిల్లు: బిల్లును వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రలు..మరి కేంద్రం ఏం చెబుతోంది..?
ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్ర హోంశాఖ దిగొచ్చింది. రాష్ట్రంలో భయాందోళనలను తొలగించే క్రమంలో విదేశీయులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పౌరసత్వం కల్పించబోమని వెల్లడించింది. అంతేకాదు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లో మినహాయిస్తే భారతదేశంలో ఎక్కడైతే విదేశీయులు సెటిల్ అయి ఉన్నారో వారికి ప్రభుత్వం తరపున అందాల్సి ఉన్న సంక్షేమ పథకాలపై కేంద్రం ఆలోచిస్తోందని హోంశాఖ తెలిపింది.
బిల్లుపై ఆందోళన చెందాల్సిన పనిలేదు
పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హోంశాఖ ప్రతినిధి అశోక్ ప్రసాద్ తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లు ఎలాంటి ఆధారాలు లేకుండా పౌరసత్వం కల్పించబోదు అని వెల్లడించారు. అన్ని ఆధారాలు ఉంటేనే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌరసత్వం కల్పించడం జరుగుతుందని దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని అశోక్ ప్రసాద్ చెప్పారు. ఒక్కరాత్రిలోనే ఇదంతా జరగదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే పౌరసత్వం
ఇక బిల్లు విషయానికొస్తే పలు అంశాలు అందులో చేర్చడం జరిగింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు ఇక్కడే ఏడేళ్లు ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పించాలని కేంద్రం భావిస్తూ ఇదే అంశాలను పొందుపర్చింది. అంటే అంతకుముందు 12 ఏళ్లుగా భారత్లో ఉన్నట్లయితే పౌరసత్వం కల్పించేవారు. తాజా బిల్లు ప్రకారం డిసెంబరు 31,2014 నుంచి వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది. అయితే కొత్త సవరణ బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విచారణ చేసి ఆమేరకు సూచనలు చేస్తే దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం కల్పించాలా లేదా అని నిర్ణయిస్తుందని ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే పౌరసత్వం కల్పించడం జరగదని వెల్లడించారు. అన్ని మతాల వారికి పౌరసత్వం ఇవ్వడం జరగదని కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్కు చెందిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ప్రసాద్ స్పష్టం చేశారు.
వ్యక్తి దేశం, మతం గురించి రాష్ట్రప్రభుత్వం విచారణ చేస్తుంది
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తిని విచారణ చేస్తుందని, అందులో ఆ వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చాడో తెలుసుకుంటుందని ఆ తర్వాత ఆయన లేదా ఆమె ఏ మతానికి చెందినదో ఎంక్వైరీ చేస్తుందని ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రెండు పరీక్షలో పాస్ అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని పౌరసత్వం కల్పించాల్సిందిగా అతను లేదా ఆమె పేరును కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరుగుతుందన్నారు. వారి దేశాల్లో మతపరంగా హింసకు గురై భారత దేశంలో తలదాచుకునేందుకు వచ్చిన వ్యక్తులకు బిల్లు కాస్త ఊరట కల్గిస్తుందని చెప్పిన ప్రసాద్... నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్కు సంబంధించిన కార్యక్రమం జరుగుతోందని చెప్పారు.
జనవరి 8న లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలో బీజేపీ మిత్ర పక్షం జేడీయూ బిల్లును వ్యతిరేకించింది. ఇక ఈశాన్య రాష్ట్రాలు కూడా బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అస్సోంలో పార్టీలు అయితే పౌరసత్వ సవరణబిల్లు కొన్ని సామాజిక వర్గాలకు ప్రమాదంగా మారుతుందని అభివర్ణించాయి.