హోటల్స్ లో లవర్స్ పై దాడులు: విచారణ
ముంబై: ముంబై నగరంలో కలకలం సృష్టించిన ప్రేమ జంటల అరెస్టులపై పోలీసులు తప్పు చేసినట్లు వెలుగు చూస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదని ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా అన్నారు.
అంతే కాకుండా ప్రేమ జంటల అరెస్టులు జరిగిన తీరుపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. హోటల్స్, బీచ్ లు, రిసార్టులు, గెస్ట్ హౌస్ లలో పోలీసులు దాడులు చేసి సరైన కారణాలు లేకుండ పోలీసులు రెచ్చిపోయి ప్రేమికులను అరెస్టు చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పోలీసుల మీద మహిళలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ దెబ్బతో ఉలిక్కిపడిన పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశాలు జారీ చేసి దర్యాప్తు చెయ్యడానికి ప్రత్యేక పోలీసు అధికారిని నియమించారు.
40 జంటలను అరెస్టు చేసిన పోలీసులు వారిని ఈడ్చుకుని పోలీస్ స్టేషన్ లకు తీసుకు వెళ్లారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ లు చేసి పోలీస్ స్టేషన్ లకు పిలిపించారు. అరెస్టు అయిన వారి లో 13 జంటలు విద్యార్థులు ఉన్నారు. వారి మీద వ్యభిచారం కేసు నమోదు చేశారు.
ఒక్కోక్కరి దగ్గర రూ.1,200 జరిమానా వసూలు చేశారు. ఈ ఘటనతో మనస్థాపం చెందిన 19 సంవత్సరాల యువతి ఆత్మహత్యాయత్నం చెయ్యడానికి ప్రయత్నించింది. తమకు మైనార్టీ తీరిందని, తమకు ఇష్టం వచ్చినవ్యక్తితో కలిసి తిరగడానికి చట్టం అనుమతి ఇచ్చిందని విద్యార్థినిలు అంటున్నారు.
అంతే కాకుండా తాము బస చేసిన హోటల్ లో తమ అసలు పేరు. గుర్తింపు ధ్రువపత్రాలు ఇచ్చామని అలాంటప్పుడు తాము తప్పు చేసిన వాళ్లు ఏలా అవుతామని వారు ప్రశ్నిస్తున్నారు. 21 సంవత్సరాల విద్యార్థిని చెంపను లేడికానిస్టేబుల్ చెల్లుమనిపించింది.
హొటల్ లోకి వెళ్లిన పోలీసులు నేరుగా అక్కడ ఉన్న సిబ్బందిని బయటకు పంపించి గదులలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకుని బయటకు వస్తున్నదృశ్యాలు హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
ఇప్పుడు ముంబైలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతున్నది. నిత్యం పోలీసులు దురుసుగా ప్రవర్థిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చెయ్యడంతో నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.