కామన్వెల్త్ గేమ్స్ 2022: భారత్కు పతకాలు తెచ్చేది ఎవరు?
బ్రిటన్లోని బర్మింగ్హామ్లో జులై 28 నుంచి ఆగస్టు ఎనిమిది వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. గత సారి మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఈ సారి మెరుగ్గా పతకాలు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.
కామన్వెల్త్ క్రీడల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఏమిటీ కామన్వెల్త్ గేమ్స్?
కామన్వెల్త్ గేమ్స్ను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వీటిని నిర్వహిస్తారు. కామన్వెల్త్ దేశాల నుంచి ఈ పోటీలకు ఆ పేరు వచ్చింది.
బ్రిటిష్ పాలనలో కొనసాగిన దేశాల మధ్య ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తర్వాత దీన్ని మూడో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు.
మొట్టమొదట ఈ స్పోర్ట్స్ను కెనడాలోని హ్యామిల్టన్లో నిర్వహించారు. అప్పట్లో వీటిని ''బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్’’గా పిలిచేవారు.
1954 నుంచి 1966 మధ్య ఈ గేమ్స్ను బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్గా పిలిచేవారు. 1970 నుంచి 1974 మధ్య వీటికి బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్గా పేరు మార్చారు. 1978 నుంచి వీటిని కామన్వెల్త్ గేమ్స్గా పిలుస్తున్నారు.
- మా 'గేమ్ ఫ్లాన్' ఫెయిలైంది: విరాట్ కోహ్లీ
- విరాట్ కోహ్లి వీగన్గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
భారత్ ఎప్పటినుంచి ఆడుతోంది?
1934లో రెండో కామన్వెల్త్ గేమ్స్ అంటే అప్పటి బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ను లండన్లో నిర్వహించారు. భారత్తోపాటు మరో 16 దేశాలకు చెందిన 500 మంది క్రీడాకారులు దీనిలో పాల్గొన్నారు. బ్రిటిష్ జెండాతోనే భారత్ పోటీల్లోకి అడుగుపెట్టింది. అప్పటికి భారత్.. బ్రిటిష్ పాలనలో ఉండేది.
కేవలం రెజ్లింగ్, అథ్లెటిక్స్లో మాత్రమే భారత్ పాల్గొంది. మొత్తం 17 దేశాల్లో భారత్కు 12వ స్థానం దక్కింది. అప్పట్లో పురుషుల 74 కేజీల కేటగిరీలో భారత్కు రషీద్ అన్వర్ కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టారు.
2022లో ఈ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి?
బ్రిటన్లోని బర్మింగ్హామ్లో జులై 28 నుంచి ఆగస్టు 8 మధ్య ఈ గేమ్స్ నిర్వహిస్తున్నారు. వీటిలో 72 దేశాలు పాల్గొంటున్నాయి. 19 స్పోర్ట్స్ విభాగాల్లో 283 మెడల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. మొత్తంగా 4,500 అథ్లెట్లు దీనిలో పాల్గొంటారు.
24ఏళ్ల తర్వాత మళ్లీ కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా క్రికెట్ మ్యాచ్లనూ నిర్వహిస్తున్నారు. విమెన్స్ క్రికెట్తోపాటు టీ20 క్రికెట్ మ్యాచ్లు కూడా ప్రస్తుతం నిర్వహిస్తారు.
ఆస్ట్రేలియా, భారత్ మహిళా క్రికెట్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జులై 29న జరగబోతోంది.
బర్మింగ్హామ్లో ఎక్కడ నిర్వహిస్తారు?
- అలెగ్జాండర్ స్టేడియం – అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, ప్రారంభ, ముగింపు వేడుకలు
- ఎరీనా బర్మింగ్హామ్ – జిమ్నాస్టిక్స్
- కైనక్ చేస్ ఫారెస్ట్- సైక్లింగ్
- కోవెంట్రీ ఎరీనా – జూడో, రెజ్లింగ్
- కోవెంట్రీ స్టేడియం – రగ్బీ
- ఎడ్జ్బాస్టన్ స్టేడియం – క్రికెట్ టీ20
- లీ వ్యాలీ వెలోపార్క్ - సైక్లింగ్
- ద ఎన్ఐసీ – బ్యాడ్మింటన్, బ్యాక్సింగ్, నెట్బాల్, టేబుల్ టెన్నిస్, పారా టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్
- సాండ్వెల్ ఆక్వాటిక్స్ సెంటర్ – డైవింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్
- స్మిత్ఫీల్డ్ – బాస్కెట్బాల్, బీచ్ బాస్కెట్బాల్, వీల్చైర్ బాస్కెట్బాల్
- సటన్ పార్క్ – ట్రైథ్లాన్, పారా-ట్రైథ్లాన్
- బర్మింగ్హామ్ యూనివర్సిటీ హాకీ అండ్ స్క్వాష్ సెంటర్ – హాకీ, స్క్వాష్
- విక్టోరియా పార్క్ – లాన్ బాల్స్, పారా లాన్ బాల్స్
- విక్టోరియా స్క్వేర్ – అథ్లెటిక్స్
- వార్విక్ – సైక్లింగ్
- వెస్ట్ పార్క్ – సైక్లింగ్
భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
కామక్వెల్త్ గేమ్స్లో భారత్ నుంచి మొత్తంగా 215 మంది పాల్గొనేందుకు వెళ్తున్నారు. పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్, సాక్షి మలిక్, బజ్రంగ్ పూనియా, నిఖత్ జరీన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
రెజ్లింగ్, బాక్సింగ్, హాకీ, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, విమెన్స్ క్రికెట్, టేబుల్ టెన్నిస్లలో భారత క్రీడాకారులు పాల్గొనబోతున్నారు.
భారత్ నుంచి 37 మంది సభ్యుల బృందం కామన్వెల్త్ గేమ్స్లో పాలుపంచుకోబోతోందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
కెనడా నగరం హ్యామిల్టన్లో జరిగిన మొదటి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పాలుపంచుకోలేదు. మొత్తంగా 11 దేశాలకు చెందిన 400 మంది దీనిలో పాల్గొన్నారు. మహిళలు కేవలం స్విమ్మింగ్లో మాత్రమే పాలుపంచుకున్నారు.
- జస్ప్రీత్ బుమ్రా: టెస్టుల్లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు, యువరాజ్ సింగ్తో పోలుస్తూ ఫ్యాన్స్ ట్వీట్లు
- చంద్రకాంత్ పండిత్: దేశవాళీ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్ కథేంటో తెలుసుకోండి
పతకాలు తెచ్చేది ఎవరు?
కామన్వెల్త్ గేమ్స్లో రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్లలో భారత్కు ఎక్కువగా పతకాలు వస్తుంటాయి. ఈ సారి గతం కంటే ఎక్కువే పథకాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు పురుషుల హాకీ, బాడ్మింటన్లో భారత్కు పతకాలు వచ్చే అవకాశముంది.
ఎవరెవరు వెళ్లారు?
- పీవీ సింధు
- లక్ష్య సేన్
- కిదాంబి శ్రీకాంత్
- అమిత్ పనఘల్
- లవ్లీనా బోర్గోహెయిన్
- మీరాబాయి చాను
- వినేశ్ ఫోగట్
- సాక్షి మలిక్
- రవి కుమార్ దహియా
- బజరంగ్ పూనియా
భారత్కు ఎన్ని పతకాలు వచ్చాయి?
1934 నుంచి 2018 మధ్య భారత్ మొత్తంగా 503 పతకాలు గెలుచుకుంది. వీటిలో 181 బంగారం, 173 రజతం, 149 కాంస్య పతకాలు ఉన్నాయి.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు అన్ని పోటీల్లోనూ భారత్ పాల్గొంది. అయితే, ఆశించిన స్థాయిలో భారత క్రీడాకారులు పతకాలు తీసుకురాలేదు.
అయితే, క్రమంగా భారత్ ప్రదర్శన మెరుగుపడింది. 2010లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే బాధ్యత భారత్ తీసుకుంది. ఆ ఏడాది రికార్డు స్థాయిలో 101 పతకాలు భారత్ గెలిచింది. దీనిలో 38 బంగారం, 27 కాంస్యం, 36 రజత పతకాలున్నాయి. పతకాలు వంద దాటడం కూడా అదే తొలిసారి. మొత్తంగా ఆ పోటీల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
- రింకూ సింగ్: కోచింగ్ సెంటర్లో గదులు తుడిచే పని నుంచి ఐపీఎల్ క్రికెట్ స్టార్ దాకా...
- ఉమ్రాన్ మాలిక్: 150 KMPH కంటే ఎక్కువ స్పీడుతో వికెట్లు ఎగరగొట్టిన 'కొత్త స్టార్’
భారత్కు ఎక్కువ పతకాలు దేనిలో వచ్చాయి?
1934 నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే, షూటింగ్లో భారత్కు ఎక్కువ పతకాలు వచ్చాయి. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. బాక్సింగ్ నాలుగో స్థానంలో, బ్యాడ్మింటన్ ఐదో స్థానంలో ఉన్నాయి.
షూటింగ్లో భారత్కు మొత్తంగా 135 పతకాలు వచ్చాయి. వీటిలో 63 బంగారం, 44 రజతం, 28 కాంస్యం ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్లో 125 పతకాలు వచ్చాయి. వీటిలో 43 బంగారం, 48 కాంస్యం, 34 రజతం ఉన్నాయి. రెజ్లింగ్లో 43 బంగారం, 37 కాంస్యం, 22 రజతంతో మొత్తంగా 102 పతకాలు వచ్చాయి.
విజయవంతమైన క్రీడాకారుడు ఎవరు?
ఒలింపిక్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. షూటర్ జస్పాల్ రానాను అత్యంత విజయవంతమైన కామెన్వెల్త్ క్రీడాకారుడిగా పేర్కొన్నారు. ఆయన మొత్తంగా 15 పతకాలు గెలిచారు. వీటిలో తొమ్మిది బంగారం, నాలుగు రజతం, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ''భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- వర్షాలు, వరదలు కాదు...ఈ దోమ మహా ప్రమాదకరం
- గోదావరి వరదలు: ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు
- శ్రీలంక: సేంద్రీయ వ్యవసాయ విధానమే ఈ సంక్షోభానికి కారణమా?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)