చత్తీస్గఢ్ ఎన్నికల సిత్రాలు: కాంగ్రెస్కు నేతల కరువు... పార్టీలో చేరుతున్న పాతతరం నాయకులు
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచార సభలుహోరెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నేతలు ఎక్కడి నుంచి పోటీచేయాలో తేల్చుకునే పనిలో పడ్డారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ నియోజకవర్గాలపై దృష్టి సారించారు నేతలు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇదే జరుగుతోంది. ఇక కాంగ్రెస్లో నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకెళుతుండగా అక్కడ కాంగ్రెస్కు నేతలు కరువయ్యారు.

కాంగ్రెస్లో కరువైన నేతలు
ఛత్తీస్గఢ్లో రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ బీజేపీ ప్రచారంలో దూసుకెళుతోంది. అయితే కాంగ్రెస్ చాలా వెనకబడి ఉంది. ఇందుకు కారణం కాంగ్రెస్కు నేతలు కరువయ్యారు. ఉన్నవారిని బరిలోకి దించితే వారు గెలుస్తారో లేదో అన్న అనుమానాలు సైతం హస్తం పార్టీని వెంటాడుతున్నాయి. ఇక నేతలపై దృష్టి సారించిన హస్తంపార్టీ ఒకప్పటి వృద్ధనేతలు సీనియర్ నాయకులను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.
మధ్యప్రదేశ్ రణభేరి: బీజేపీపై అగ్రకులాలు అసహనం

అరవింద్ నేతంకు ఎన్నికల సమన్వయ కమిటీ బాధ్యతలు
అప్పుడెప్పుడో కాంగ్రెస్ను వీడి మరో పార్టీలో కొనసాగిన గిరిజన నేత మాజీ లోక్సభ సభ్యులు అరవింద్ నేతం తిరిగి హస్తం గూటికి చేరారు. దీంతో ఆయనకు ఎన్నికల సమన్వయ కమిటీ బాధ్యతలు కాంగ్రెస్ అప్పగించింది. అంతేకాదు ఛత్తీస్గడ్లోని పలువురు నాయకులు కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఇందులో వినోద్ తివారీ , వాణీ రావు, మహేంద్ర బహదూర్ సింగ్ లాంటి నేతలున్నారు. అంతేకాదు ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వారి జాబితా చాలానే ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీలోకి కూడా క్యూ కడుతున్న పాతతరం నేతలు
ఇక బీజేపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఒకప్పుడు పార్టీని వీడిన వారు తిరిగి కమలం గూటికి చేరుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీ రెబల్ అభ్యర్థి మాజీ మంత్రి గణేష్ రామ్ భగత్ తిరిగి కాషాయం పార్టీలోకి వచ్చారు. బీజేపీ సీనియర్ నేత సౌదన్ సింగ్, భగత్ను కలిసి చర్చించారు. ఇంకా ఇలా తిరిగి పార్టీలో చేరేవారు చాలామందే ఉన్నారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ పీయూష్ భగేల్ అల్లుడు విజయ్ భగేల్ కూడా తిరిగి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. 2008లో జరిగిన ఎన్నికల్లో పీయూష్ భగేల్ను మట్టికరింపించారు. టికెట్ కేటాయింపుల్లో విబేధాలు రావడంతో ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.

అజిత్ జోగి, మాయావతిల పొత్తుతో కాంగ్రెస్లో ఆందోళన
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి కాంగ్రెస్లో రెండు సార్లు పార్టీలో చీలిక ఏర్పడింది. ఒకటి 2002లో విద్యాచరణ్ శుక్ల పార్టీని వీడి చాలామంది కాంగ్రెస్ నేతలను తనతోపాటు తీసుకెళ్లి బీజేపీలో చేరారు. 2004లో తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక రెండోది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కాంగ్రెస్ను వీడి సొంతకుంపటి పెట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి ఆయన బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే అజిత్ జోగీ పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్గడ్తో కలిసి బీఎస్పీ బరిలో దిగుతుండటంతో కాంగ్రెస్లో ఆందోళన నెలకొంది. వీరిద్దరి కలయిక కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయొచ్చేమోనని హస్తం పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications