అవిశ్వాసం: ఆరుగురు ఎంపీలపై వేటు!, జగన్ ఎంపీ పైనా
న్యూఢిల్లీ: యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆరుగురు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం బుధవారం వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, హర్ష కుమార్, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశివ రావులను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి.
వీరు ఆరుగురు రెండు రోజుల క్రితం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా యూపిఏ 2 ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును సభాపతికి ఇచ్చారు. దీంతో వారిపై అధిష్టానం వేటు వేయనుంది. ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి పైన కూడా చర్యలకు సిద్ధమవుతోంది.
2009లో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడుగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఇటీవల జగన్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులతో కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో కలిసి నోటీసును ఇచ్చారు. దీంతో ఆయనపైనా చర్యలకు అధిష్టానం సిద్ధపడుతోంది.
అవిశ్వాసం వీగిపోతుంది: పిసి చాకో
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని కాంగ్రెసు అధికార ప్రతినిధి పిసి చాకో ధీమా వ్యక్తం చేశారు. ఆరుగురు ఎంపీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపై వేటు వేయడం ఖాయమని చెప్పారు. మరో మూడు, నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఏ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదన్నారు.