కోల్ స్కాం: దాసరి, జిందాల్లకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. దాసరితోపాటు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు కూడా సమన్లు పంపించింది.
కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. అమర్కొండ ముర్గదంగల్ బొగ్గుగని కేటాయింపు కేసులో నవీన్ జిందాల్ నిందితుడుగా ఉన్నారు. ఇంకా బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, ఐదు పారిశ్రామిక సంస్థలతో సహా 11 మందికి కోర్టు సమన్లు జారీ చేసింది.
సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్ సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 29వ తేదీన సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో సిబిఐ 15 మందిని నిందితులుగా చేర్చింది.
15 మంది నిందితుల్లో పది మంది వ్యక్తులతో పాటు ఐదు సంస్థలున్నాయి. ఆ ఐదు సంస్థలు జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ లిమిటెండ్, జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇది కూడా జిందాల్ కంపెనీయే), న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ (జిందాల్ కంపెనీ), సౌభాగ్య మీడియా లిమిటెడ్.
దాసరి నారాయణ రావు, మధు కొడా, జిందాల్తో పది మంది నిందితుల్లో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సి గుప్తా, ఆరుగురు ప్రైవేట్ వ్యక్తుల్లో జ్ఞాన్ స్వరూప్ గార్గ్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, గిరీష్ కుమార్ జునేజా, ఆర్కె సరాఫ్, కె రామకృష్ణ ప్రసాద్ ఉన్నారు.