చెన్నైలో తుఫాన్ భీభత్సం: తీర ప్రాంతంలో కల్లోలం..
చెన్నైలో వార్దా తుఫాన్ భీభత్సం మొదలైంది. తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీస్తుండటంతో.. జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది.
చెన్నై: వార్దా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. గంటకు 150కి.మీ వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతం చెన్నైని వర్షం ముంచెత్తుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
బయటకు రావద్దని హెచ్చరిక!
సహాయ సామాగ్రితో 11యుద్ద నౌకలను నేవీ ఇప్పటికే సిద్దం చేసింది. చెన్నై-గూడూరు మధ్య రైళ్లను నిలిపివేశారు. రహదారుల వెంట చెట్లు నేలకూతుండటంతో ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
స్కూల్స్ కు సెలవు:
తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో అన్ని రంగాలపై పడే అవకాశం కనిపిస్తుంది. పలు చోట్ల స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తుఫాన్ ఎఫెక్ట్ తో చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
22ఏళ్ల తర్వాత ఇంత వేగంతో..:
22ఏళ్ల తర్వాత ఇంత వేగంతో గాలులు వీచడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే తీర ప్రాంతంలో 7350మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గజ ఈతగాళ్లతో 30మంది బృందాలను ప్రభుత్వం సిద్దం చేసింది.
నెల్లూరుపై ఎఫెక్ట్ :
కాకినాడ-ఉప్పాడ మధ్య రాకపోకలను నిలిపివేశారు. కాకినాడ తీర ప్రాంతంలో సముద్రం ఉప్పొంగుతుండటంతో.. తీర ప్రాంతం కోతకు గురవుతుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరుపై వార్దా తుఫాన్ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24గం.ల్లో అక్కడ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
సాయంత్రం తీరం దాటే అవకాశం:
సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో వార్దా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈదురు గాలులు, వర్ష భీభత్సంతో చెన్నై ప్రజల్లో అప్పుడే భయం మొదలైంది. ప్రభుత్వం అన్ని విభాగాలను అప్రమత్తం చేసి పరిస్థితిని సమీక్షిస్తోంది.