బాబ్రీపై తీర్పు మరుసటి రోజే అయోధ్యకు యోగి ఆదిత్యనాథ్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలపై కుట్ర అభియోగాలు నమోదై, బెయిల్ మంజూరైన మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు సందర్శనకు సిద్ధమయ్యారు.
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలపై కుట్ర అభియోగాలు నమోదై, బెయిల్ మంజూరైన మరుసటి రోజే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు సందర్శనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు యోగి బుధవారం అయోధ్యలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సందర్భంగా రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని సందర్శించి అక్కడ ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ప్రారంభించిన లక్నోలోని సీబీఐ కోర్టు మంగళవారం బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి సహ మరికొందరు నేతలపై కుట్ర అభియోగాలను నమోదు చేసింది. అయితే ఈ కేసులో వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీజేపీ అగ్రనేతలు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, సీఎం యోగి పర్యటనకు, లక్నో తీర్పుకూ ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేశారు. యోగి పర్యటన షెడ్యూల్ ఇంతకుముందే ఖరారు చేసిందని.. తాజాగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొన్నాయి. కాగా, 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.