దినకరన్ సంచలన నిర్ణయం: పన్నీరు అంగీకరిస్తారా?
తాజా పరిణామాల నేపథ్యంలో దినకరన్ ఓ మెట్టు దిగివచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన పార్టీ పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు ఒక్కటి కావడానికి సిద్ధపడుతున్నాయనే వార్తల నేపథ్యంలో అన్నాడియంకె ఉప ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ఉప ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే, తన మేనత్త శశికళను మాత్రం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని ఆయన కోరినట్లు సమాచారం. అలా అంగీకరిస్తే పన్నీర్ సెల్వం వర్గాన్ని తమతో కలుపుకుంటామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఇరు వర్గాల విలీనం చర్చలను కూడా ఆయన స్వాగతించారు. బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన ఆయన సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన తాజా పరిణామాలపై చర్చించారు.
చర్చల తర్వాత ఇలా....
పార్టీ ఒక్కటిగా ఉండాలని అనుకుంటున్నామని, తామంతా త్వరలో ఒక తాటిపైకి వస్తామని మంత్రి సెంగొట్టయన్ చెప్పారు. దినకరన్తో చర్చల నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. అయితే, శశికళ వర్గాన్ని దూరంగా పెడితేనే విలీనానికి సిద్ధమని పన్నీరు సెల్వం కచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది.
మెట్టు దిగిన దినకరన్...
తనను, శశికళను పార్టీ నుంచి సాగనంపేందుకు పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు ఏకమవుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో దినకరన్ దిగి వచ్చినట్లు చెబుతున్నారు. తాను పార్టీ పదవిని వదులుకోవడానికి సిద్ధపడుతూ తన మేనత్తను మాత్రం కాపాడే ఉద్దేశంతో ఆయన ఆ పనిచేసినట్లు సమాచారం.
పన్నీరు ససేమిరా....
పన్నీర్ సెల్వం మాత్రం శశికళపై కత్తి కట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. శశికళతో పాటు దినకరన్ను కూడా పక్కన పెడితేనే విలీనానికి సిద్ధపడుతానని పన్నీర్ సెల్వం చెప్పినట్లు సమాచారం. మన్నార్ గుడి మాఫియా నుంచి అమ్మ పార్టీని రక్షించడమే తన ధ్యేయంగా ఆయన చెబుకుంటున్నారు.
పళని ఏం చేస్తారు...
తాజా పరిణామాల నేపథ్యంలో పళని స్వామి ప్రభుత్వం సంక్షోభంలో పడినట్లు చెబుతున్నారు. దాంతో ఆయన పన్నీరు సెల్వంతో రాజీకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. శశికళ జైలుకు వెళ్లడం, దినకరన్ కీలకమైన కేసులో చిక్కుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో తాను పన్నీరుతో రాజీకి రావడమే మంచిదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా చెబుతున్నారు.