'భీమ్' యాప్ అంటే ఏమిటో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన ప్రతిష్టాత్మక 'భీమ్' యాప్ ఏమిటో, అదెలా పనిచేస్తుందో, దాని ద్వారా ఏమేం లావాదేవీలు జరపవచ్చో చూద్దాం!
డిజిటల్ లావాదేవీల సులభతరానికి ప్రతిష్టాత్మక 'భీమ్' యాప్ ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని కొనియాడారు. ఇంతకీ అసలు ఈ భీమ యాప్ ఏమిటో, అదెలా పనిచేస్తుందో, దాని ద్వారా ఏమేం లావాదేవీలు జరపవచ్చో మీకు తెలుసా?
డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని,, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన ఈ 'భీమ్' పూర్తి పేరు.. 'భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ'. ఈ యాప్ ఇటు స్మార్ట్ ఫోన్లలోనూ, అటు ఫీచర్ ఫోన్లలోనూ పనిచేస్తుంది. విచిత్రం ఏమిటంటే.. అసలు ఈ యాప్ ఉపయోగానికి ఇంటర్నెట్ అవసరమే ఉండదు.
డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం కూడా లేకుండానే కేవలం తమ చేతివేళ్ళతో వినియోగదారులు ఈ యాప్ ను ఉపయోగించి డిజిటల్ లావాదేవీలను పూర్తిచేయవచ్చు. ఈ యాప్ కు సంబంధించిన మరికొన్ని ప్రత్యేకతలు మీకోసం.
ఇవీ 'భీమ్' యాప్ ప్రత్యేకతలు...
* ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉన్న భీమ యాప్ త్వరలో ఐఓఎస్ వెర్షన్ ఆధారిత మొబైల్ ఫోన్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ యాప్ కేవలం మీ మొబైల్ నంబర్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ లేదా చెల్లింపు సదుపాయం కల్పిస్తుంది.
* మీరు ఎక్కడైనా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు సదరు దుకాణదారుడు కూడా ఈ యాప్ గనుక వినియోగిస్తుంటే.. యాప్ ను తెరిచి, సెండ్ మనీ అని కొట్టి, చెల్లించాల్సిన మొత్తం, వ్యాపారి ఫోన్ నంబర్ టైపు చేస్తే చాలు. సెకన్ల వ్యవధిలో చెల్లింపు జరిగి పోతుంది. మీ బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్ అయి, వ్యాపారి బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
* క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్ వినియోగదారులకు కల్పిస్తోంది. వ్యాపారులు కూడా ఈ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ లను జనరేట్ చేసుకోవచ్చు. మర్చంట్ కి నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు స్కాన్ ను టాప్ చేసి, యాప్ లోని పే బటన్ ను నొక్కాలి. తర్వాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు.
* ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు చెల్లింపుల కోసం మొదట *99# ను డయల్ చేయాలి. అనంతరం వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ కనిపిస్తుంది. నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల చరిత్ర కోసం నోక్కవలసిన వివిధ నంబర్లు మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
* ఉదాహరణకు.. నగదు పంపించాలనుకుంటే, 1 నంబరు టైప్ చేసి, సెండ్ నొక్కాలి. ఎవరికి పంపించాలకున్నారో వారి మొబైల్ నంబరు టైపు చేసేందుకు మళ్ళీ 1 నంబరు నొక్కాలి. తర్వాత సదరు వ్యక్తి ఫోన్ నంబరు, చెల్లింపు మొత్తం టైపు చేసి 'పిన్'ను జనరేట్ చేసుకోవాలి.
* ఈ భీమ్ యాప్ తో రూ.10 వేల వరకు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఇలా రోజుకు రూ.20 వేల వరకు ఎవరికైనా నగదు పంపించుకోవచ్చు. మొబైల్ వాలెట్ యాప్ ద్వారా అయితే మొదట అందులో నగదు నింపుకుని, తర్వాత లావాదేవీలు జరపవలసి ఉంటుంది.
* అయితే ఈ భీమ యాప్ లో ముందుగా నగదు నింపుకోవలసిన అవసరం కూడా లేదు. డెబిట్ కార్డు మాదిరిగా ఇది నేరుగా వినియోగదారుల ఫోన్, బ్యాకు ఖాతాకు లింక్ అయి ఉంటుంది కాబట్టి చెల్లింపులు వెంట వెంటనే జరిగిపోతాయి.
* వ్యాపారులు కూడా ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి తదితర దిగ్గజ బ్యాంకులతో పాటు యూపీఐ అనుసంధానత కలిగి ఉన్న అన్ని బ్యాంకులు 'భీమ్' యాప్ తో లావాదేవీలకు అంగీకరిస్తాయి.
* ఒకవేళ యూపీఐ అనుసంధానత కలిగిలేని బ్యాంకులు కూడా ఐఎఫ్ఎస్ సి కోడ్ ఆధారంగా ఈ యాప్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుతాయి. ఇలా సులభతరమైన ఇంటర్ఫేస్ కలిగి ఉండబట్టే 'భీమ్' యాప్ అమలును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.