1962 యుద్ధం నుంచి పాఠాలు, ఎవరొచ్చినా సిద్ధమే, ఇదీ మన సత్తా: చైనాపై జైట్లీ
సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భారతావనికి బుధవారం ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఉన్నది 1962 భారత్ కాదని, ఎలాంటి పరిస్థితిని అయినా మనం ధీటుగా ఎదుర్కోగలమని చెప్పా
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ భారతావనికి బుధవారం ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఉన్నది 1962 భారత్ కాదని, ఎలాంటి పరిస్థితిని అయినా మనం ధీటుగా ఎదుర్కోగలమని చెప్పారు.
పార్లమెంటు వేదికగా జైట్లీ భారత భద్రతా దళాల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు. క్విట్ ఇండియా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
1962 యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకున్నాం
1962లో జరిగిన యుద్ధం నుంచి భారత్ పాఠాలు నేర్చుకుందని జైట్లీ చెప్పారు. దేశ భద్రతకు, దేశ సార్వభౌమత్వం కోసం మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. మన ఆర్మీ ఎలాంటి పరిస్థితి వచ్చినా ధీటుగా సమాధానం చెప్పగలదని చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి కావాలని కోరుకుంటున్నారు
1948లో పాకిస్తాన్ ఆక్రమించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారత్లో కలవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పక్క దేశాల నుంచి వచ్చే సమస్యలను మనం సొంతగా ఎదుర్కోగలమని చెప్పారు.
ప్రతి ఛాలెంజ్తో బలపడ్డాం
మనకు ఇన్నాళ్లుగా వస్తున్న ప్రతి సవాల్తో మనం రోజు రోజుకూ బలపడుతున్నామని జైట్లీ చెప్పారు. ఇది చెప్పేందుకు తనకు గర్వంగా ఉందన్నారు. దేశ భద్రత కోసం ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందన్నారు.
కొందరు టార్గెట్ చేశారు
గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొందని జైట్లీ చెప్పారు. 1962తో పోల్చితే భారత భద్రతా దళాలు 1965, 1971 యుద్ధాల్లో మరింత బలం పుంజుకున్నాయన్నారు. ఇప్పటికీ పలు సవాళ్లు ఉన్నాయన్న విషయం ఒప్పుకుంటున్నానని, కొందరు మన దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని టార్గెట్ చేసుకున్నారన్నారు.
ఎటు నుంచి వచ్చినా మనం సిద్ధం
అయితే దేశ భద్రతను కాపాడేందుకు మన సైనికులు సమర్దులని బలంగా నమ్ముతున్నానని జైట్లీ చెప్పారు. తూర్పు నుంచి వచ్చినా, పశ్చిమ సరిహద్దుల నుంచి వచ్చినా తిప్పికొట్టగలమన్న పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
రాజీవ్, ఇందిరా గాంధీలు టెర్రరిజానికి బలయ్యారు
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తీవ్రవాదానికి బలయ్యారని జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు దేశాల్లోని వారు, దేశంలో కొందరు తీవ్రవాదాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ము కాశ్మీర్ పోలీసులు తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు.