ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర, హర్యానాల్లో బిజెపియే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బిజెపియే ముందంజలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెసుపై బిజెపి రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పైచేయి సాధించే అవకాశాలున్నట్లు తెలుపుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ బుధవారం పోలింగ్ జరిగింది.
మహారాష్ట్ర శానససభలో 288 సీట్లు ఉండగా, బిజెపి 129 సీట్లు సాధిస్తుందని నౌ - సీ వోటర్ అంచనా వేసింది. కాంగ్రెసుకు 43, శివసేనకు 56, ఎంఎన్ఎస్కు రెండు, ఇతరులకు 12 సీట్లు వస్తాయని చెప్పింది. హర్యానా శాసనసభలో 90 సీట్లు ఉండగా, బిజెపికి 37 స్థానాలు, కాంగ్రెసుకు 4, ఐఎన్ఎల్డికి 28 సీట్లు, హెచ్జెసికి ఆరు సీట్లు వస్తాయని నౌ - సీ వోటర్ ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది.
ఎబిపి - నీల్సన్ పోల్ కూడా అదే విషయం చెప్పింది. మహారాష్ట్రలో బిజెపికి 127, శివసేనకు 77, కాంగ్రెసుకు 40, ఎన్సిపీకి 10, ఎంఎన్ఎస్కు ఐదు స్థానాలు వస్తాయని చెప్పింది. హర్యానాలో బిజెపికి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని అంచనా వేసింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ ఎగ్జిట్ పోల్ కోసం అభిప్రాయ సేకరణ జరిగింది. బిజెపి 46, కాంగ్రెసు పది, ఐఎన్ఎల్డి 29, హెచ్జెసి 2, ఇతరులు మూడు స్థానాలు సాధించనున్నట్లు తేల్చింది.
కాగా, బిజెపికి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా స్థానాలు లభించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపికి 144 స్థానాలు అవసరమవుతాయి. బిజెపి శివసేన మద్దతు ఇస్తుందా, లేదా అనేది తేలాల్సి ఉంది.
అయితే, చాణక్య పోల్ మాత్రం మహారాష్ట్రలో బిజెపికి 155 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. శివసేనకు 71, కాంగ్రెసుకు 27, ఎన్సీపికి 28, ఎంఎన్ఎస్కు 2, ఇతరులకు 13 స్థానాలు వస్తాయని తేల్చింది. హర్యానాలో బిజెపికి 52, కాంగ్రెసుకు 10, ఐఎన్ఎల్డికి 23, ఇతరులకు 5 స్థానాలు వస్తాయని చెప్పింది.