ప్రతినెల గ్యాస్ ధరలు పెరగొచ్చు? సొంత ఎంపీల ఆగ్రహం
న్యూఢిల్లీ: గ్యాస్, కిరోసిన్ ధరలను ఇక నుండి నెల చొప్పున పెంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వంట గ్యాస్ ధరను సిలిండర్కు ప్రతి నెల రూ.5 చొప్పున, కిరోసిన్ ధరను నెలకు ఒక్క రూపాయి చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే కేంద్రం రైల్వే ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోందట. గ్యాస్ ధరలను సమీక్షించేందుకు ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇప్పుడు మంగళవారం ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన మరో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
గ్యాస్ పైన నెలకు రూ.5 చొప్పున, కిరోసిన్ పైన నెలకు యాభై పైసల నుండి రూపాయి చొప్పున పెంచడం ద్వారా రూ.80వేల కోట్ల రాయితీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోందట. కాగా, యూపీఏ ప్రభుత్వం 2013 జనవరి నెలలోనే డీజీల్ ధరలను ప్రతి నెల 50 పైసలు పెంచాలని నిర్ణయించింది. యూపీఏ దారిలోనే ఇప్పుడు ఎన్డీయే ఎల్పీజీ, కిరోసిన్ ధరలను ప్రతి నెల పెంచాలని భావిస్తున్నారట.
కేంద్రంపై సొంత పార్టీ ఎంపీల ఒత్తిడి
రైలు ఛార్జీలు పెంచడంపై మహారాష్ట్రకు చెందిన శివసేనతో పాటు సొంత పార్టీ బిజెపి ఎంపీలు కూడా అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడను శివసేన, బిజెపి ఎంపీలు సోమవారం ఉదయం కలిశారు. రైల్వే ఛార్జీలు పెంచడం వల్ల ముంబై ప్రయాణీకులు ఇబ్బందులు పడతారని వారు సదానంద దృష్టికి తీసుకు వెళ్లారు. ముంబై రైళ్లలో రోజుకు 75 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.