కరోనా వైరస్ : వాళ్లలో హైరిస్క్ ఎక్కువా..? ఆ వ్యాధులు ఉంటే తస్మాత్ జాగ్రత్త..!!
ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిల్లాడిపోతోంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాలన్నీ శాయాశక్తులా కృషి చేస్తున్నాయి. ఇప్పటివరకు వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టకపోవడంతో.. స్వీయ నియంత్రణతోనే చాలా దేశాలు దీన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టేజ్-2 నుంచి స్టేజ్-3 లోకి వెళ్లకుండా లాక్ డౌన్ ఉపయోగపడుతుందని చాలామంది భావించారు.
నిజానికి లాక్ డౌన్ మంచి ఫలితమే ఇచ్చినప్పటికీ.. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో మత ప్రార్థనలకు హాజరైన వారి ద్వారా చాలా రాష్ట్రాలకు వైరస్ వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. దీంతో భారత్ మూడో దశలోకి ప్రవేశించిందని.. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా ఎవరిలో హైరిస్క్ ఉంటుంది.. ఏ వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
ఆ వ్యాధులు.. ముఖ్యంగా ఆస్తమా..
ఆస్తమా,ఊపిరితిత్తుల సమస్యలు,క్యాన్సర్,డయాబెటీస్,గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు కావడంతో.. ఒకవేళ వీరు వైరస్ బారిన పడితే రిస్క్ ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి సాధారణ వ్యక్తుల కంటే వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
కరోనా వైరస్ అనేది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. వైరస్ సోకినవారికి ఆస్తమా ఉంటే.. వారిలో ఆయాసం మరింత తీవ్రమవుతందని ముంబైకి చెందిన శ్వాసకోశ వైద్య నిపుణుడు డా.ప్రశాంత్ తెలిపారు. అయితే వైరస్ కారణంగా ఆస్తమా పేషెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు,లెక్కలు లేవన్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
వైరస్ సోకినవారిలో 80శాతం మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని.. 15శాతం మందిలో అనుమానిత లక్షణాలు ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. మరో 2.5శాతం మందికి మాత్రం వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆస్తమా పేషెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు వాడటం మానేయవద్దని డా.ప్రశాంత్ తెలిపారు.
వైద్యుల ప్రిస్కిప్షన్ మేరకు మెడిసిన్ వాడాలని సూచించారు. ఇలా మందులు వాడటం ద్వారా ఒకవేళ వైరస్ సోకినా.. దాన్ని ఎదుర్కొనేందుకు దోహదపడుతున్నారు. ఆస్తమా పేషెంట్స్ సోషల్ డిస్టెన్స్ పాటించడం.. గుంపులుగా ఉండే చోట ఉండకపోవడం.. ఇళ్లకే పరిమితమవడం అతి ముఖ్యమని చెప్పారు. ఆస్తమా ఉన్నవారికి ఒకవేళ కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే.. తక్షణం సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకోవాలని మరో వైద్యుడు డా.భట్టాచార్య సూచించారు. కొద్దిరోజుల పాటు క్వారెంటైన్లో ఉంటే చాలావరకు లక్షణాలు తగ్గిపోవచ్చని చెప్పారు. ఒకవేళ రెండు వారాలకు మించి అదే లక్షణాలు ఉంటే.. శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటనే ఆసుపత్రిలో చేరాలని తెలిపారు. తక్కువ జ్వరం,పొడి దగ్గు,ఒళ్లు నొప్పులు,నీరసం,వాసన,రుచి తెలుసుకోలేకపోవడం.. ఇవన్నీ కరోనా వైరస్ లక్షణాలుగా చెప్పారు.
బ్రిటన్లో ఇన్హేలర్స్ కొరత..
కరోనా వైరస్ కారణంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తుండటంతో.. నిత్యావసరాలే కాదు.. కొంతమంది భారీ మొత్తంలో మెడిసిన్,ఇన్హేలర్ వంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో బ్రిటన్లో ప్రస్తుతం ఇన్హేలర్స్ కొరత ఏర్పడటంతో ఆస్తమా పేషెంట్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత శుక్రవారం, కేంబ్రిడ్జ్షైర్లోని సెయింట్ నియోట్స్లో నివసించే ఓ మహిళ, తన కుమార్తె ఇన్హేలర్స్ అయిపోవడంతో.. తను రెగ్యులర్గా వెళ్లే ఫార్మసీని సంప్రదించింది. అయితే అక్కడ కూడా ఇన్హేలర్స్ అయిపోయాయని చెప్పడంతో.. చాలా మెడికల్ షాపులకు వెళ్లి సంప్రదించింది.
ఎక్కడా ఇన్హేలర్స్ దొరక్కపోవడంతో.. తన కుమార్తె బాధ చూడలేక కన్నీటి పర్యంతమైంది. దయచేసి ఎవరూ భారీ మొత్తంలో ఇన్హేలర్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవద్దని.. మిగతావాళ్లకు అవి దొరక్క ఇబ్బందిపడుతున్నారని వాపోయింది.