అసంతృప్తి: చెన్నైలో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతం ఎగ్మోర్లో ఎన్ హరీశ్(32) అనే యువ ఐపీఎస్ అధికారి గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన హరీశ్ 2009 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్.
ప్రస్తుతం ఆయన చెన్నైలో విజిలెన్స్ అండ్ యాంటి కరప్షన్ విభాగం అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. హరీశ్ చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్లో ఉంటున్నారు.
కాగా, గురువారం ఉదయం 10 గంటలైనా తలుపు తెరవకపోవడంతో ఆయన కోసం వచ్చిన కార్యాలయ సిబ్బంది తలుపు పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూసేసరికి హరీశ్ చనిపోయి ఉన్నాడు.
అధికారుల సమాచారం ప్రకారం హరీశ్కు పదోన్నతి ఆలస్యమైన విషయంలో విచారణ జరుగుతోంది. అతడి బ్యాచ్ వారందరికీ రెండేళ్ల క్రితమే ప్రమోషన్స్ వచ్చాయి. హరీశ్ ఆత్మహత్యకు పదోన్నతి అంశమే కారణమా? లేక వేరే ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డిజిపి కె రామానుజం తెలిపారు.
కాగా, గతంలో హరీశ్ మదురై సమీపంలోని థళ్లకుళం, రామనాథపుర సమీపంలోని కిలకరాయిలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పని చేశారు.