బీజేపీకి బిగ్ షాక్: ఆర్ఎస్ఎస్ సర్వే ఏం తేల్చిందంటే?, కర్ణాటకలో కొంప మునిగినట్టేనా!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని అటు సిద్దరామయ్య, ఇటు యడ్యూరప్ప ఇద్దరూ ధీమాగా చెబుతున్నారు. సర్వే లెక్కలు మాత్రం 'హంగ్'కే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు, లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కే పట్టం అన్నట్టు చెబుతున్నాయి. సరే, ఎవరి లెక్కల్ని బీజేపీ పరిగణలోకి తీసుకుంటుందో లేదో తెలియదు కానీ తమ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లెక్కలను మాత్రం కచ్చితంగా సీరియస్ గానే తీసుకుంటుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సర్వేలోనే బీజేపీకి 70 సీట్లు మించవని తేలిందట.
Recommended Video


బీజేపీకి బిగ్ షాక్:
ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో బీజేపీ గెలుపు ప్రయత్నాల్ని 70సీట్లకే పరిమితమవుతాయని తేలిందట. దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్ వి.నాగరాజ్ ఈ సర్వే నివేదికను బెంగళూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు స్వయంగా అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి 115-120సీట్ల వరకు వస్తాయని ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడైందట. ఇక జేడీఎస్ పార్టీకి 29-34సీట్లు దక్కుతాయని అంచనా వేసిందట.

అవే కొంపముంచాయి?:
సర్వేలో బీజేపీ రెండో స్థానానికే పరిమితమవడం వెనుక కారణాలను ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయట. ముఖ్యంగా రాష్ట్రంలోని అహింద(మైనారిటీ, బడుగు బలహీనవర్గాలు, దళితులను) ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో బీజేపీ దారుణంగా విఫలమైనట్టు తేలిందట. అలాగే యడ్యూరప్పకు లింగాయత్ లపై పట్టు సడలిందని, గాలి జనార్థన్&గ్యాంగ్ కి పార్టీలో ప్రాధాన్యం పెరగడం, జీఎస్టీ సమస్య, పెరుగుతున్న పెట్రో ధరలు... ఇవన్నీ కలిసి బీజేపీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయని ఒక అంచనాకు వచ్చారట.

తోసిపుచ్చిన బీజేపీ:
ఆర్ఎస్ఎస్ నివేదికతో అమిత్ షా ఖంగుతిన్నట్టు చెబుతున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ నివేదికలు ఇలా బయటకు లీక్ అయ్యే ఛాన్సే లేదని, అవి అత్యంత గోప్యంగా నిర్వహిస్తారని బీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. ఒకరకంగా బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే ఈ కుట్రలకు తెరలేపారని వారు ఆరోపిస్తున్నారు. పైకి బీజేపీ ఈ మాట చెబుతున్నప్పటికీ.. సర్వే నివేదికతో ఇప్పటికే పార్టీ అభ్యర్థుల్లో అలజడి మొదలైందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

మోడీ స్ట్రాటజీ:
బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా లేదని తేలడంతోనే ప్రధాని మోడీ జేడీఎస్ దేవెగౌడను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందులో బాగంగానే ఇటీవల మోడీ దేవెగౌడపై ప్రశంసలు కురిపించారని అంటున్నారు. అంతేకాదు, బీజేపీ గెలుపుకు అత్యంత సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడంతో.. మోడీ జిల్లాల పర్యటనను సైతం మరో నాలుగు జిల్లాలకు పెంచడం గమనార్హం.












Click it and Unblock the Notifications