ఏ క్షణంలోనైనా నాగాలాండ్పై దాడి: ఉగ్ర శిక్షణలో 2వేలమంది రోహింగ్యాలు
కోహిమా: తాజాగా అందిన నివేదిక ప్రకారం.. కేంద్రం ఆందోళన చెందిన విధంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. రోహింగ్యా అక్రమ వలసదారులతో దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని నాగాలాండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి తెలిపింది. ఇప్పటికే దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు పాకిస్థాన్, బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.
రోహింగ్యాలకు ఆయుధాలు అందించేలా ఇప్పటికే బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలతో దిమాపూర్ ఇమామ్ చర్చలు జరిపినట్లు నాగాలాండ్ నిఘా వర్గాలు తెలిపాయి. సుమారు 2 వేల మంది రోహింగ్యాలకు రహస్య ప్రదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి.
బలమైన ఆయుధాలతో కూడిన రోహింగ్యాలు ఏ క్షణంలో అయినా నాగాలాండ్ మీద విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్రానికి తెలిపాయి. ముఖ్యంగా నాగాలాండ్లోని హెబ్రాన్, ఖేచి క్యాంప్లపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని నాగాలాండ్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
సరిహద్దులకు ఆవల ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరాలకు చేరుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు.. యువతకు మిలటరీ శిక్షణ ఇస్తున్నారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (రిటైర్డ్) వీకే గౌర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద జమాత్ఘుద్ దవా, జమాత్ ఈ ఇస్లామీ, ఆల్ఖైదా, ఐఎస్ఐ వంటి సంస్థలు కూడా రోహింగ్య శరణార్థి శిబిరాల్లో ప్రవేశించాయని ఆయన తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన శుక్రవారం కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.