గాజు ఇంట్లో ఉంటూ, కాశ్మీర్ ఎప్పటికీ మాదే: పాక్ను దులిపేసిన సుష్మా
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ సోమవారం నాడు ఐక్య రాజ్య సమితోలో పాకిస్తాన్ దుమ్ము దులిపారు. గాజు గ్లాసుల ఇంట్లో ఉంటున్న వారు ఇతరుల ఇళ్ల పైకి రాళ్లు విసరడం మంచిది కాదని కాశ్మీర్, బెలూచిస్తాన్లను ప్రస్తావించారు.
బెలూచిస్తాన్లో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారన్నారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో సమితి విఫలమైందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఒంటరిని చేయాలన్నారు. ఓ వైపు బెలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, కాశ్మీర్ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడటం విడ్డూరమన్నారు.
ఉగ్రవాద దాడులపై ఆధారాలున్నాయి
సీమాంతర ఉగ్రవాదంతో భారత్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న పాక్ తన కలలు మానేయాలని సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. పాక్.. భారత్లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు అనేక సాక్ష్యాలున్నాయని స్పష్టం చేశారు. వాటిని పాక్ కాదనగలదా అని సూటిగా ప్రశ్నించారు.
స్నేహ హస్తం అందిస్తే యూరి బహుమతి
భారత్ స్నేహ హస్తం అందిస్తే పాకిస్తాన్ మాత్రం తమకు ఉగ్రవాదాన్ని బహుమతిగా ఇచ్చిందన్నారు. పఠాన్ కోట్, యూరి దాడులను బహుమతిగా పాక్ ఇచ్చిందన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి భారత్ పైన మాటల దాడి చేసిన షరీఫ్కు సుష్మా తన ఆగ్రహం ద్వారా ఘాటు కౌంటర్ ఇచ్చారు.
కాబూల్, ఢాకా, బ్యాంకాక్, పటాన్ కోట్, యూరితో పాటు సిరియా, ఇరాక్లో నిత్యం జరుగుతున్న ఉగ్ర మారణ హోమాన్ని అడ్డుకోవడంలో ఐక్య రాజ్య సమితి విఫలమైందన్నారు.
భారత్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఎవరు సాయం చేస్తున్నారో ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యం అన్నారు. ఆఫ్గనిస్థాన్ ఇదే ప్రశ్నను ఎన్నో సంవత్సరాల నుంచి సంధిస్తున్నా పక్క దేశం నుంచి సమాధానం రావడం లేదన్నారు.
పాక్ను అదే ఉగ్రవాదం నాశనం చేస్తోంది
పాక్ పెంచిన ఉగ్రవాద భూతం పాక్ను నాశనం చేస్తోందన్నారు. అయినా ఆ దేశం గుణపాఠం నేర్వకపోవడం శోచనీయమన్నారు. ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం యత్నించాలన్నారు. ఉగ్రవాదులకు రక్షణకేంద్రాలుగా మారిన దేశాలను గుర్తించాలన్నారు.
ఐరాస సంస్థలు గుర్తించిన ఉగ్రవాదులు కొన్ని దేశాల్లో అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నారని, దీంతో పాటు మరికొందరికి శిక్షణ ఇచ్చి పొరుగుదేశాలపై దాడులకు చేయూతనిస్తున్నారన్నారు. సెప్టెంబరు 21న ఇదే వేదికపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన ఉందని ఆరోపించారన్నారు.
కాశ్మీర్ భారత్లో అంతర్భాగం.. ఎప్పటికీ
అయితే ఆ ఆరోపణలకు ముందు పాక్లోని పరిస్థితులను షరీఫ్ తెలుసుకోవాలన్నారు. బలూచిస్థాన్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మానవహక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి తెలుసునని చెప్పారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఈద్ శుభాకాంక్షలు తెలిపాం, స్నేహహస్తమందించామన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించామని, అయితే మాకు పాక్ తిరిగి ఇచ్చింది ఉగ్రదాడులన్నారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగమన్నారు. ఆ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తామనుకోవడం భ్రమే అన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగమే అన్నారు.