కుప్పకూలిన బొగ్గు గని: 10మంది మృతి, శిథిలాల కిందే 50మంది కార్మికులు
జార్ఖండ్ రాష్ట్రంలోని లాల్మాటియా వద్ద గురువారం అర్ధరాత్రి బొగ్గు గని కుప్పకూలింది.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లాల్మాటియా వద్ద గురువారం అర్ధరాత్రి బొగ్గు గని కుప్పకూలింది. గురువారం రాత్రి కార్మికులు విధులు మారుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పది మంది మృతి చెందగా, శిథిలాల కింద మరో 50 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు తెలిసింది.
సమాచారం తెలుసుకున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్దాస్ సహాయ చర్యలను చేపట్టాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. సహాయబృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి.
గాయపడిన వారిని ఉర్జానగర్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ధన్బాడ్, పాట్నాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 10-12 యంత్రాలు, 40కి పైగా వాహనాలు గనిలో పనిచేస్తున్నాయని ఎస్పీ హిరాలాల్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంపైనే దృష్టిపెట్టామని ఆయన వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
10మంది మృతదేహాల వెలికితీత
గనిలో చిక్కుకుపోయిన 10మంది కార్మికుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు బయటికి తీశాయి. కార్మికులను బయటికి తీసేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.