అసెంబ్లీ ఎన్నికలు; పార్టీల ఖర్చులకు నో బ్రేక్, అభ్యర్థులకు టార్గెట్, 4. 96 కోట్ల ఓటర్లు!
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల తేదీ ప్రకటించిన భారత ఎన్నికల కమిషన్ అనేక నియమాలు పాటించాలని సూచించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. అయితే ఎన్నికల ఖర్చుల పెట్టే విషయంలో పార్టీలకు మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు.
Recommended Video
ఒకే రోజు పోలింగ్
కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో మే 12వ తేదీ ఒకే రోజు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భారత ఎన్నికల కమిషన్ చీఫ్ ఓం ప్రకాష్ రావత్ మీడియాకు చెప్పారు. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తామని ఓం ప్రకాష్ రావత్ అన్నారు.
4.96 కోట్ల ఓటర్లు
కర్ణాటకలో మొత్తం 4. 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.51 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.44 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కన్నడ, ఇంగ్లీష్ బాషల్లో ఓటర్ల జాబితా ఉంటుందని భారత ఎన్నికల కమిషన్ చీఫ్ ఓం ప్రకాష్ రావత్ వివరించారు.
మొత్తం మహిళా సిబ్బంది
మే 12వ తేదీ ఒకేరోజు జరిగే కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ కోసం 56,696 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని భారత్ ఎన్నికల కమిషన్ చీఫ్ ఓం ప్రకాష్ రావత్ అన్నారు. 450 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఓం ప్రకాష్ రావత్ చెప్పారు.
ఎన్నికల ఖర్చులు
రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చులు పెట్టడానికి ఎలాంటి నిబంధనలు విధించలేదు. అయితే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం రూ. 28 లక్షలకు మించకుండా ఖర్చు చెయ్యాలని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
నామినేషన్లు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏప్రిల్ 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లు వెయ్యడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 27వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించడానికి అవకాశం కల్పించారు. మే 12 తేదీ పోలింగ్, మే 15వ తేది కౌంటింగ్ ఉంటుందని భారత ఎన్నికల కమిషన్ చీఫ్ ఓం ప్రకాష్ రావత్ తెలిపారు.