వామ్మో.. ఇదో రకం వైరస్.. కేరళలో 13 మందికి పాజిటివ్.. ఎలా సోకుతుందంటే
కరోనా వైరస్ అంటే గజ్జున భయపడే పరిస్థితి. ఆ భయం ఇప్పటికీ ఉంది. అయితే కరోనా వేరియంట్స్ భయపెడుతున్నాయి. ఇటు కొత్త కొత్త వైరస్ మరింత భయపెడుతున్నాయి. కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కొత్త వైరస్ కేరళ ప్రజలను భయపెడుతోంది. కొత్త వైరస్ కారణంగా స్థానికులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులను కేరళ ప్రభుత్వం గుర్తించింది. రెండు వారాల క్రితం వయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్లోని వెటర్నరీ కాలేజీలో 13మంది విద్యార్థులకు అరుదైన నోరోవైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ వైరస్ సోకిన వారు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇది అంటువ్యాధి అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. పాడైపోయిన ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
ప్రస్తుత పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పశువైద్య విజ్ఞాన కళాశాల విద్యార్థుల డేటా బ్యాంక్ను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు. క్యాంపస్ వెలుపల హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థుల్లో మొదట ఇన్ఫెక్షన్ సోకిన వారిని గుర్తిస్తున్నామని వెటర్నరీ కళాశాల అధికారులు తెలిపారు. నమూనాలను సేకరించి పరీక్షల కోసం అలప్పుజాలోని ఎన్ఐవికి పంపినట్టు వైద్యాధికారులు తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన ఆరోగ్య అధికారుల సమావేశం నిర్వహించి వయనాడ్లో పరిస్థితిని సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సూపర్ క్లోరినేషన్ సహా నివారణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, సరైన నివారణ, చికిత్సతో వ్యాధిని త్వరగా నయం చేయవచ్చని వైద్యాధికారులు మంత్రికి తెలిపారు.