పోలవరం: కెకె తీర్మానం, రాజ్నాథ్ బిల్లు ప్రతిపాదన
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు కె. కేశవ రావు రాజ్యసభలో సోమవారం తీర్మానాన్ని ప్రతిపాదించారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. తాను ప్రతిపాదించిన తీర్మానంపై చర్చను ముందుగా చేపట్టాలని, ఆ తర్వాత బిల్లుపై చర్చ పెట్టాలని ఆయన కోరారు.
పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును రాజ్యసభ ఆమోదించవద్దని ఆయన కోరారు. బిల్లుపైనా, తీర్మానంపైనా ఓటింగ్ జరగాలని ఆయన అన్నారు. ఆ తర్వాత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పోలవరం ఆర్డినెన్స్ బిల్లును సభలో ప్రతిపాదించారు.
భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ముంపు ప్రాంతాలవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఆయన చెప్పారు. 1958కి ముందు పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రలోనే ఉండేవని ఆయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును తమ గత ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతోందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్రి అవుతుందని చెప్పారు. 45 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు 16 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇప్పటికే 32 శాతం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏడు మండలాలను ఆంధ్రకు బదిలీ చేయడానికి బదులు, ముంపు గ్రామాలను మాత్రమే బదిలీ చేయాలని యుపిఎ మంత్రివర్గం ఫిబ్రవరి 12వ తేదీన నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఆర్డినెన్స్లో మండలాలను బదిలీ చేస్తూ జారీ అయిందని, దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. నాలుగు మండలాలను, ముంపు గ్రామాలను ఆంధ్రకు బదిలీ చేయాలని, భద్రాచలం ఆలయాన్ని, పట్టణాన్ని తెలంగాణలో ఉంచాలని మార్చి 1వ తేదీన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయించినట్లు, ఇది ఇరు ప్రాంతాలవారికి అమోదయోగ్యంగా జరిగిందని ఆయన చెప్పారు. మార్చి 1వ తేదీన జరిగిన మంత్రి వర్గ నిర్ణయాన్నే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టసవరణ బిల్లులో పొందుపరిచిందని ఆయన చెప్పారు.