సీఎం విజయ్, మంత్రికి మద్రాస్ హైకోర్టు వార్నింగ్..! తలో 50 వేల జరిమానా..!
తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ (Vijay) .. మెజార్టీ లేకపోవడం, గవర్నర్ తో విభేదాల నేపథ్యంలో ఆలస్యంగానే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాలన మొదలుపెట్టిన విజయ్.. బిజీగా ఉంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించిన విజయ్, ఒక చోట పోటీ చేసి గెలిచిన ఆయన కేబినెట్ మంత్రి, టీవీకేలో నంబర్ టూ ఆధవ్ అర్జునపై మద్రాస్ హైకోర్టులో (Madras High Court) పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీరిద్దరి ఎన్నికల్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ లో సాధించిన విజయాలు, అధవ్ అర్జున (Aadhav Arjuna) సాధించి విజయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై వీరిద్దరూ హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే వీరికి హైకోర్టు నోటీసులు కూడా పంపింది. అయినా వీరు స్పందించకపోవడంతో ఇవాళ హైకోర్టు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 27 కల్లా తమ స్పందన తెలియజేయడంలో విఫలమైతే ఇద్దరికీ తలో 50 వేల చొప్పున జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది.

వీరిద్దరి తరపున వాదిస్తున్న లాయర్లు.. మరో రెండు వారాల పాటు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే ధర్మాసనం ఆ అభ్యర్ధనను తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 86 ప్రకారం ఎన్నికల వివాదాలను ఆరు నెలల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని జస్టిస్ లక్ష్మీ నారాయణన్ తెలిపారు. కేసు కొట్టివేతకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించడానికి ఇకపై అదనపు సమయం ఇచ్చేది లేదని తేల్చేశారు. ఈ విషయం తాము గతంలోనే చెప్పామని గుర్తుచేశారు. కాబట్టి గడువులోకా వివరణలు ఇస్తారా లేక జరిమానాలు ఎదుర్కొంటారా తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications