రాష్ట్రపతి అభ్యర్థి: సీఎం కేసీఆర్కు మమత లేఖ, ఇతర సీఎంలు, నేతలకు కూడా
రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటివరకు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ మిగతా పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని అనుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించేందుకు ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ను మమత ఆహ్వానించారు.
8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహా 22 మంది జాతీయ నేతలకు మమత లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా విపక్షాలను బెంగాల్ సీఎం కూడగడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బలమైన ప్రత్యర్థిని బరిలో నిలిపేందుకు మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించే భేటీకి 22 మంది నేతలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు పలువురి ప్రముఖులకు లేఖలు రాశారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరును బీజేపీ పరిశీలిస్తోంది. దాదాపు ఖాయం అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదివరకు దళితుడు కోవింద్కు ఛాన్స్ ఇవ్వగా.. ఈసారి మైనార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆరిఫ్ కాకుంటే వెంకయ్య నాయుడుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి అయిన ఆయనకు ప్రమోషన్ లభిస్తోందని చర్చ జరుగుతుంది.
ఇక ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు వినిపిస్తోంది. ఈయన కాంగ్రెస్ వీడి.. ఎన్సీపీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పదవీ వరించకపోవడంతో.. కనీసం రాష్ట్రపతి పదవీ ఊరిస్తోంది. పవార్ కాకుంటే లోక్ సభ మజీ స్పీకర్ మీరా కుమార్ను బరిలోకి దింపే అవకాశం ఉంది. ఈమె కూడా దళిత అభ్యర్థి కావడం విశేషం. సో మరోసారి దళితులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కానీ గెలవాలంటే మాత్రం తగినన్నీ ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉంటుంది.
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈ నెల 15న జారీ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. జూన్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ను జులై 18న నిర్వహిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.