భారత్-ఆసీస్: కుక్క మొరిగిందని.. యువకుడి హత్య!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను చూస్తుండగా.. అదే పనిగా కుక్క మొరుగుతుండటంతో కోపం వచ్చిన క్రికెట్ చూస్తున్న వ్యక్తులు ఆ శునకం యజమానిని అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
దీంతో అతను తన స్నేహితులను తీసుకొచ్చి వారిపై దాడికి ప్రయత్నించాడు. అంతేగాక, పగిలిన బీరు బాటిల్తో ఓ యువకుడిని పొడిచి చంపేశాడు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. నగరంలోని జేసీనగర్ నివాయైన అవినాష్(21) ప్రైవేటు కాలేజీలో బీ.కామ్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి భారత్-ఆసీస్ మ్యాచ్ను ఓపెన్ ఏరియాలో బిగ్ స్క్రీన్పై అతను తన స్నేహితులతో చూస్తున్నాడు.
అదే సమయంలో జాన్ కెన్నడీ అనే యువకుడు తన కుక్కతోపాటు అక్కడికి వచ్చాడు. ఈక్రమంలో కెన్నడీ పెంపుడు కుక్క మొరగడం ప్రారంభించింది. అది మొరుగుతుంటే తమకు ఇబ్బందిగా ఉందని, దానిని తీసుకెళ్లి ఇంట్లో కట్టేయమని కెన్నడీకి అక్కడివారు చెప్పారు.
కావాలంటే, వాల్యూమ్ పెంచుకుని మ్యాచ్ చూడమని, తమ కుక్కను ఇంట్లో కట్టేసే ప్రసక్తే లేదని కెన్నడీ, అతని మిత్రులు సమాధానమిచ్చారు. దీంతో కెన్నడీ, అవినాష్ వర్గాల మధ్య మాటామాటా పెరిగి. .ఘర్షణకు దారితీసింది.
మద్యం సేవించి ఉన్న కెనడీ బీర్ బాటిల్ పగులగొట్టి దాంతో అవినాష్ను పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన అవినాష్ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కెన్నడీని అరెస్ట్ చేశారు.
అవినాశ్ మృతిలో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఒక అనవసరమైన చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణం తీసి అతని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.