ఉగ్రవాదులకు సహకరిస్తే..: ఆర్మీ చీఫ్ హెచ్చరిక, కాశ్మీర్లో ఉద్రిక్తత
ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాల్లో సైన్యాన్ని అడ్డుకోవడం, జవాన్ల పైన రాళ్ల దాడికి పాల్పడే కాశ్మీర్ యువకులను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు.
శ్రీనగర్: ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాల్లో సైన్యాన్ని అడ్డుకోవడం, జవాన్ల పైన రాళ్ల దాడికి పాల్పడే కాశ్మీర్ యువకులను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. దీనిపై కాశ్మీర్లో పలువురు ఆందోళనకారులు రెచ్చిపోయారు.
శ్రీనగర్లో ఓ మసీదు వద్ద పాకిస్తాన్, ఐసిస్ జెండాలు పట్టుకొని కొందరు ఆందోళనకారులు నిరసన తెలిపారు. పోలీసుల పైన రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యల పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాత్రం కాంగ్రెస్ పైన ఎదురు దాడి చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు కాశ్మీర్ యువతలో శతృత్వ భావాలను పెంచుతాయని, ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ పరిజ్ఞానం లేని మాటలు అని పలువురు అన్నారు. వారి వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహించారు.
కాగా, దేశభద్రతకు విఘాతం కలిగించి, అస్థిరతకు పాల్పడాలని భావించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఉగ్రవాదుల అణిచివేత చర్యలకు అడ్డుతగిలే వారిని విద్రోహ శక్తులుగా పరిగణించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు.