ముస్లీం మహిళల పట్ల లింగ వివక్ష: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముస్లీం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా అనే విషయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ధర్మాసనం (బెంచ్) ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు పేర్కోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.
బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏ.ఆర్. దవే, జస్టిస్ ఏ.కే. గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టారు. ముస్లీం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా అనే అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిజస్టర్ చెయ్యాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది.
ముస్లీం మహిళల విడాకుల్లో రక్షణ హక్కుల చట్టం అంశాలను పరిశీలించేందుకు మరో ధర్మాసనం ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యంగం హామీలు ఇచ్చినా ముస్లీం మహిళలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారని చెప్పారు.
ఏక పక్షంగా విడాకులు ఇవ్వడం, మొదటి పెళ్లి అమల్లో ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకోవడం తదితర విషయాల్లో ముస్లీం మహిళలకు తగిన రక్షణ లేకుండా పోతున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వలన ముస్లీం మహిళ సమాజంలో గౌరవం, రక్షణ కోల్పోతున్నదని సుప్రీం కోర్టు పేర్కొంది.