నితీష్కుమార్ నిజంగానే ఫూల్ చేశారా? మంత్రి మెలిక
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారా? ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం ఉంటుందని ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అయితే, దాని పైన సీఎం నితీష్ యూ టర్న్ తీసుకున్నారు.
ఏప్రిల్ 1, 2016 నుంచి కేవలం దేశీయ మద్యం పైనే నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, భారత్లో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) ధరలను పెంచుతామని, తద్వారా సామాన్యులతో పాటు అందర్నీ కొనుగోలుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది.
మరోవైపు, బీహార్ ఎక్సైట్ మరియు ప్రొహిబిషన్ షాఖ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ ఓ ఆంగ్ల పత్రికతో కేవలం దేశీయ మద్యం పైనే నిషేధం అన్న వార్తల పైన స్పందించారు. అన్ని రకాల మద్యం పైన నిషేధం ఉంటుందని తెలిపారు.
మద్యం మరణానికి దారి తీస్తుందని, ఏదైనా ప్రభుత్వం మరణాన్ని అమ్ముతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని, అల్కాహాల్ ఎట్టి పరిస్థితుల్లోను అమ్మే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే, అన్ని రకాల మద్యం ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేసేందుకు యత్నిస్తామని, అయితే అది దశలవారీగా జరుగుతుందని మెలిక పెట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కొందరు మహిళలు మద్యం విషయమై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను నిలదీశారు. దీంతో మద్యం పూర్తిగా నిషేధిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. ఇటీవలే ఆయన ఏప్రిల్ 1 నుంచి మద్యాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కేవలం దేశీయ మద్యం పైనే అని వార్తలు వస్తున్నాయి.