బెంగాల్లో అంతేనా...ఇక మారదా: నాలుగో విడతలో కూడా కొనసాగుతున్న హింస
పశ్చిమ బెంగాల్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న రాష్ట్రం. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు మమతా వశం అయ్యింది. ఎప్పుడూ కమ్యూనిస్టులకు టీఎంసీలకు మధ్య ఉన్న పోటీ కాస్త ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్యకు మారింది. కమలం పార్టీ కూడా బెంగాల్లో ఎలాగైనా సరే సీట్లు గెలిచి అక్కడ కూడా తమ పట్టును సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు బీజేపీపై దీదీ పోరు కూడా ఇక్కడ హైలైట్గా నిలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక బెంగాల్ పరిస్థితిలో మార్పు రాదా... ఎన్నికల్లో గెలిచేందుకు హింసనే నమ్ముకున్నారా...?
ఒక్క బెంగాల్లోనే హింసాత్మక ఘటనలు
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఏప్రిల్ 29న నాల్గవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంటే ఒక్క బెంగాల్లో మాత్రం హింసాత్మక సంఘటనలు జరిగినట్లు కనిపిస్తున్నాయి. అత్యంత సున్నిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానం కోసం జరుగుతున్న పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుండగా ఒక్క బెంగాల్లోనే హింసాత్మక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలా తొలిదశ ఎన్నికల మొదలు నాల్గవ దశ వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
దీదీ పోటీ బీజేపీ- టీఎంసీల మధ్యే....
కమ్యూనిస్టులకు పశ్చిమ బెంగాల్ కంచుకోటగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. తాజాగా పశ్చిమ బెంగాల్ అంటే మమతా దీదీ ...మమతా దీదీ అంటే పశ్చిమ బెంగాల్గా పరిస్థితి మారింది. అంతలా సీఎం మమతా బెనర్జీ బెంగాల్పై పట్టు సాధించారు. బెంగాల్లో ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగిశాయి. అయితే జరిగిన మూడు విడతల్లో ఒక్క బెంగాల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎంతవరకంటే ఏకంగా ప్రాణాలు తీసుకునే స్థాయిలో గొడవలు జరిగాయి. అయితే గొడవలు జరిగింది మాత్రం టీఎంసీ బీజేపీల మధ్యే. బెంగాల్లో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసే ఎన్నికల సంఘం కూడా ఆ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాలకు పోలింగ్ అని విడతల్లో జరిగేలా ముందస్తు జాగ్రత్త తీసుకుంది. బలగాలు భద్రత ఉన్నప్పటికీ అక్కడ గొడవలు జరగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో వాహనం ధ్వంసం
ఇక నాలుగవ విడతలో కూడా బెంగాల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అసన్సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తృణమూల్ కార్యకర్తలు కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు భద్రతా దళాలపై దాడికి దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇదిలా ఉంటే అసన్సోల్ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వచ్చారు. ఆయనపై దాడులు చేసేందుకు ప్రయత్నించారు టీఎంసీ కార్యకర్తలు. ఇక్కడే బీజేపీ కార్యకర్తలకు టీఎంసీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే టీఎంసీ కార్యకర్తలు బాబుల్ సుప్రియో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్న దీదీ
బెంగాల్లో రాజకీయంగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎన్నికలంటే కమ్యూనిస్టులు తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవలు జరిగేవి. కానీ ఇప్పుడు బీజేపీ టీఎంసీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అసలే మోడీ విధానాలు బీజేపీ పాలనపై దీదీ గుర్రుగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు పలుమార్లు బీజేపీ ర్యాలీలను అనుమతి పేరుతో అడ్డుకుంది మమతా సర్కార్. అంతేకాదు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హెలికాఫ్టర్ బెంగాల్ గడ్డపై ల్యాండ్ కాకుండా అడ్డుకుంది మమత. అక్కడ రథ యాత్రలకు కూడా బ్రేక్ వేసింది. ఇక అక్కడి నుంచి రెండు పార్టీల మధ్య వైరం మరింత పెరిగింది. మోడీ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి రాకుండా ఉండేందుకు మమతా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఈ ఏడాది జనవరిలో మెగా ర్యాలీని కోల్కతా వేదికగా నిర్వహించి బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించారు. మరోవైపు బీజేపీ కూడా మమత పాలనను ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్నారు. ఆమె నియంతలా బెంగాల్ను పాలిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రధాని మోడీ.
మొత్తానికి ఒకప్పుడు కమ్యూనిస్టులు టీఎంసీల మధ్య ఉన్న వార్ ఇప్పుడు బీజేపీ టీఎంసీల వార్గా మారింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఇరుపార్టీలు సహకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటరును బెదిరించి ఓట్లు వేయించుకోవాలనుకోవడం ఇరుపార్టీల వారికీ అవివేకమైన చర్యే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.