ఆధారాలు సరిపోవ్: ఈడీకి షాక్, సంతోషంలో మాల్యా?
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు భారీ ఊరట లభించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టిన మాల్యాను ఎలాగైనా తిరిగి భారత్కు రప్పించాలన్న ఈడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఇంటర్ పోల్ ద్వారా విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని చూస్తున్న ఈడీకి నిరాశే ఎదురైంది. ఈ మేరకు ఈడీ అభ్యర్ధనపై ప్రాథమిక విచారణ చేపట్టిన ఇంటర్నేషనల్ పోలీసు ఆర్గనైజేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన సాక్ష్యాలు సరిపోవని తేల్చి చెప్పింది.
విజయ్ మాల్యాపై భారత ప్రభుత్వం ఎలాంటి నేరారోపణలను రుజువు చేయలేకపోయిందని ఇంటర్ పోల్ పేర్కొంది. ఈ క్రమంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేమని చెప్పింది. అంతేకాదు భారత్ ప్రభుత్వం అభ్యర్ధనపై విజయ్ మాల్యా వివరణను ఇంటర్ పోల్ కోరనుంది.
ఇందుకోసం లండన్లో విజయ్ మాల్యా నివాసం ఉంటున్న ఎస్టేట్కు ఇంటర్ పోల్ డైరెక్టర్ను పంపించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు గాను తమకు రెండు నుంచి మూడు నెలలపాటు సమయం కావాలని కూడా భారత ప్రభుత్వాన్ని చెప్పినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విజయ్ మాల్యాను ఈడీ నిందితుడిగా పేర్కొనడాన్ని కూడా ఇంటర్ పోల్ తప్పుబడుతోంది. విజయ్ మాల్యాను స్వదేశానికి పంపించాలని గతంలో యూకే ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం విజయ్ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని స్పష్టం చేసింది.
యూకే చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని దేశం నుంచి పంపించివేసే అధికారం తమకు లేదని బ్రిటన్ పోలీసులు స్పష్టంచేశారు. అయితే ఈ కేసు నిమిత్తం భారత్కు అవసరమైతే ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని యూకే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్ పోల్ను భారత ప్రభుత్వం కోరింది.