అసలు సమస్యలపై దాటవేత: మోడీ ప్రసంగం నిరుత్సాహకరం!
నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల పైన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అసలు సమస్యల పైన దాటవేత ధోరణి అవలంభించారా? అంటే అవునే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల పైన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అసలు సమస్యల పైన దాటవేత ధోరణి అవలంభించారా? అంటే అవునే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రధాని మోడీ రైతులకు, పేదలకు అనేక వరాలు ప్రకటించారు. అయితే, అదే సమయంలో దాటవేత ధోరణి కూడా అవలంభించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నవంబర్ 8వ తేదీ నాటి ప్రసంగంలో నల్లధనం రూపుమాపుతామని, ప్రజలు యాభై రోజులు ఓపిక పడితే అద్భుతాలు చూడవచ్చునన్నారు.
ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే విషయమై స్పందించలేదని అంటున్నారు. రద్దయిన పాతనోట్లన్నీ తిరిగి బ్యాంకులకు వచ్చాయన్న వార్తల పైన ప్రధాని మాట్లాడలేదని అంటున్నారు.
తొలుత చరిత్రను, చివర్లో చిన్న చిన్న పథకాలు, వరాలు కురిపించారు. వరాలు కురిపించినప్పటికీ కీలకమైన అంశాలపై ఆయన స్పందించలేదని అంటున్నారు. క్యూ లైన్లలో నిలబడిన సందర్భంలో ప్రధాని ఏదో శుభవార్త చెబుతారని ఎదురు చూశారని, కానీ నిరాశ ఎదురయిందని కొందరు అంటున్నారు.
పెద్దనోట్ల రద్దుపై టీవీలో ప్రధాని మోదీ ప్రసంగం చాలా నిరుత్సాహకరంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం, ప్రజల కష్టాలపై మోడీ ఎందుకు మాట్లాడలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత 50 రోజుల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని రూపు మాపారో మోడీ ఎందుకు చెప్పలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసిందని దీనికి సంబంధించి మోడీ ఏమీ మాట్లాడలేదని పేర్కొంది.
చాలా కీలకమైన ప్రశ్నకు మోడీ ఈ ప్రసంగంలో సమాధానం చెప్పలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశంలో 125 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది మంది తీవ్ర కష్టాలుపడ్డారని, ప్రధాని తన ప్రసంగంలో వాటిని నామమాత్రం కూడా ప్రస్తావించలేదన్నారు.
నోట్ల రద్దుతో ధాని సన్నిహితులే బాగుపడ్డారని ఆరోపించారు. నగదు వితడ్రాపై ప్రధాని ఆంక్షలు ఎత్తేస్తారని చాలామంది ఆశతో ఎదురు చూశారని, అదేమీ జరగలేదన్నారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకుని మోడీ.. టీవీలో బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు.
అవినీతిపై యుద్ధం ఆగదు: తేల్చేసిన మోడీ
మోడీ చేసిన ప్రసంగం నిరుత్సాహపరిచిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ ఉత్తమాటలే చెబుతారని తేలిపోయిందని, ఆయన ఏది చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరని, నోట్ల రద్దుతో అంతర్జాతీయంగా అభాసుపాలయ్యారని ట్విట్టర్లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.