'రెండాకుల'పై ట్విస్ట్: జైలుకు శశికళ.. పన్నీరుకు బీజేపీ-స్టాలిన్ చేయి
పన్నీరు సెల్వం వర్గీయులు పార్టీ పైన పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి పార్టీ గుర్తు అంశం వరకు వారు దేనినీ వదలడం లేదు.
చెన్నై: పన్నీరు సెల్వం వర్గీయులు పార్టీ పైన పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి పార్టీ గుర్తు అంశం వరకు వారు దేనినీ వదలడం లేదు.
రేపు (శనివారం) ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ ఉండటంతో గోల్డెన్ బే రెస్టారెంటులో ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు పన్నీరు వర్గం ప్రయత్నిస్తోంది.
పన్నీరు వైపు మరో ఎమ్మెల్యే: శశికళకు చెక్ చెప్పేందుకు 'సీఎం'పై కొత్త వ్యూహం
దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి పైన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పన్నీరు వైపు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలాగు పన్నీరు బలనిరూపణలో నెగ్గే అవకాశం లేదు. కాబట్టి పళనిస్వామిని దెబ్బతీయాలని పన్నీరు వర్గం చూస్తోంది.
ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న పన్నీరు వర్గం.. తాజాగా పార్టీ గుర్తు రెండు ఆకుల పైన కూడా వ్యూహ రచన చేస్తోంది. అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో పార్టీ గుర్తు అయిన రెండాకులను ప్రస్తుతానికి సుప్తావస్తన చేతనలో ఉంచాలని పన్నీరు వర్గం ఎంపీలు కోరుతున్నారు.
తిరుగుబావుటా
మూడోసారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం పైన చాలామందికి సానుభూతి కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు సీఎం పీఠమెక్కి కొద్ది కాలానికే ఆ పదవిని జయలలితకు అప్పగించాల్సి వచ్చింది. మూడోసారి శశికళ దెబ్బకు ఆయన పదవీ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయన, ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేస్తున్నారు.
చేయిచ్చిన బీజేపీ, డీఎంకే
అన్నాడీఎంకే అంతర్గత కొట్లాటలో బీజేపీ, డీఎంకేలు పన్నీరు వైపు ఉన్నట్లుగా వాదనలు ఉన్నాయి. అయితే, పన్నీరుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ఆ రెండు పార్టీలు ఆఖరి నిమిషంలో చేయిచ్చాయని, తమ ప్రత్యర్థి శశికళ జైలు పాలైనందున ఇక పన్నీరుకు మద్దతివ్వాల్సిన అవసరం లేదని పక్క కు తప్పుకొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
బీజేపీతో..
జయలలిత మృతి చెందిన కొద్ది రోజులకే శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుననారు. కానీ కేంద్రంలోని పెద్దలు దానికి మోకాలడ్డారు. ఆమె భర్త నటరాజన్కు నచ్చ చెప్పి చూశారు. ఆమె సీఎం కావడం బీజేపీ పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు. నటరాజన్ కూడా శశికళకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసినా, కుదరలేదంటున్నారు. ఆ తర్వాత జైలుకు వెళ్లడం వేరే విషయం.
క్రమంగా మార్పు..
అయితే, అప్పటి దాకా పన్నీరుకు అండగా నిలిచిన బీజేపీ, డీఎంకేలు.. ఆమెకు జైలు శిక్ష పడిన తర్వాత మనసు మార్చుకున్నాయని అంటున్నారు. అప్పటి వరకూ ప్రజా భిప్రాయం మేరకు నడుచుకుంటామని ప్రకటించిన స్టాలిన.. అన్నాడీఎంకేకి చెందిన ఇరువర్గాలూ తమకు సమాన ప్రత్యర్థులేనని చెప్పారు. ఇక, అప్పటి దాకా పన్నీరుకు బీజేపీ టచ్లో ఉందని, ఆ తర్వాత నుంచి మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందంటున్నారు.
పన్నీరు ఇలా..
ఇదిలా ఉండగా, పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేని పన్నీరు సెల్వం బీజేపీ, డీఎంకే అండతో ముందుకు వెళ్లాలని భావించారని అంటున్నారు. శశికళ కోసం రాజీనామాచేసి.. రెండు రోజుల్లోనే ఆయన తిరుగుబావుటా ఎగరవేయడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికీ..
పలువురు సీనియర్లు పన్నీరుకు మద్దతు పలుకుతున్నప్పటికీ.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన ఎమ్మెల్యేలు మాత్రం మద్దతు పలకడం లేదు. ఆయనకు కేవలం పది, పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతిస్తున్నారు. ఇప్పటికీ కూడా తాము గెలవలేని పరిస్థితుల్లో.. పళనిని దెబ్బతీసేందుకు పన్నీరు వర్గం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.