పఠాన్కోట్: నిజం గుర్తించకుండా పోలీస్లు చితక్కొట్టారు
పఠాన్కోట్: పఠాన్కోట్లో ఉగ్ర దాడి సంచలనం రేపింది. ఈ విషయమై ఓ షాకింగ్ విషయం గోపాల్ అనే బాధితుడు చెబుతున్నాడు. గురుదాస్పూర్ మాజీ ఎస్పీతో పాటూ తనను కూడా కొందరు వ్యక్తులు అపహరించి హింసించారంటూ గోపాల్ అనే బాధితుడు పోలీసుల ఎదుట వెళ్లబోసుకున్న గోడు అరణ్యరోదనే అయిందట.
గురువారం గురుదాస్పూర్ మాజీ ఎస్పీ సల్వీందర్ సింగ్ వంట సహాయకుడైన గోపాల్ను సైనిక దుస్తుల్లో ఉన్న తీవ్రవాదులు విడిచి పెట్టగానే పరుగున పోలీసు స్టేషన్కు వెళ్లాడు. పోలీసులు తాను చెప్పిన కీలక సమాచారాన్ని వినలేదని, పైగా తనను బాగా కొట్టారని వాపోయాడు.
ఆ రోజు పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు తనను చిత్రహింసలు పెట్టిన వైనాన్ని అతను ఓ దిన పత్రికతో పంచుకున్నాడు. తనను తీవ్రవాదులు విడిచిపెట్టగానే చీకట్లో ఎలాగో దారి వెతుక్కుంటూ ఒళ్లంతా గాయాలతో దాదాపు రెండు గంటలు నడిచి ఓ గ్రామానికి చేరానని, అక్కడి పోలీసు స్టేషన్లో నేను విషయం చెప్పానన్నాడు.
తాను చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదని, స్థానిక పోలీసులు, కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు తనకు నరకం చూపించారన్నాడు.
మరోవైపు పఠాన్కోట్లో దాడులు మొదలైన తర్వాత కూడా తనకు హింస తప్పలేదని, తన ఆక్రందనను ఎవరూ పట్టించుకోలేదని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కీలకమైన సమాచారం వెంటనే అందించినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. ఆ రోజు తమ ముగ్గురినీ అపహరించి, శారీరకంగా హింసిన తీవ్రవాదుల స్వరాలను బట్టి చూస్తే వారు యువకుల్లా అనిపించారన్నాడు.