పేటీఎం మాల్ హ్యాక్: డేటా తస్కరణ, భారీ మొత్తంలో డిమాండ్, అదేంలేదన్న సంస్థ
ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం, పేటీఎం మాల్లో వినియోగదారులకు సంబంధించిన డేటా చోటీరిక గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థకు చెందిన పేటీఎం మాల్ డేటా బేస్పై జాన్ విక్ అనే గ్రూపునకు చెందిన హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిసింది. దొంగిలించిన డేటాను తిరిగి ఇచ్చేందుకు హ్యాకర్లు పేటీఎం మాల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తున్నారని సైబిల్ అనే అంతర్జాతీయ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది.
ప్రముఖ సంస్థలలోని సాంకేతిక లోపాలను పరిష్కరిస్తామంటూ ఈ హ్యాకర్లు ఆ కంపెనీల డేటా బేస్పై దాడి చేయడంలో నైపుణ్యంగలవారని సైబిల్ తెలిపింది. సంస్థలోని వ్యక్తుల సహాయంతోనే డేటా చోటీరికి గురైనట్లు పేటీఎం వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. డేటాను తిరిగి పొందేందుకు హ్యాకర్లు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి పేటీఎం మాల్ అంగీకరించినట్లుగా సైబిల్ పేర్కొనడం గమనార్హం.
అయితే, పేటీఎం అధికార ప్రతినిధి మాత్రం తమ సంస్థకు సంబంధించి ఎలాంటి డేటా చోరీ కాలేదంటూ ఈ వార్తలను కొట్టిపారేశారు. తమ వినియోగదారులకు సంబంధించిన డేటా భద్రంగా ఉందన్నారు. సంస్థ డేటా హ్యాకింగ్ గురైనట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
డేటా భద్రతకు సంబంధించి తాము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టామని, బగ్ బౌంటీ కార్యక్రమం కింద సంస్థలోని సాంకేతిక సమస్యలను గుర్తించినవారికి ప్రోత్సహకాలు కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి తాము సెక్యూరిటీ రీసెర్చ్ కమ్యూనిటీతో కలిసి పనిచేస్తామని వివరంచారు. తమ వినియోగదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి డేటా ఎంతో భద్రంగా ఉందని స్పష్టం చేశారు.