బ్రిటన్ రాజు చార్లెస్ 3తో తొలిసారి సంభాషించిన ప్రధాని మోడీ: కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారంనాడు బ్రిటన్ రాజు చార్లెస్-3తో ఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. బ్రిటన్ రాజుగా చార్లెస్-3 నియమితులైన తర్వాత.. ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్బంగా చార్లెస్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
వాతావరణ సమస్యలు, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం వినూత్న పరిష్కారాల అన్వేషణ తదితర అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించినట్లు పీఎంవో వెల్లడించింది. దీంతోపాటు జీ20కి భారత్ అధ్యక్షత, మిషన్ లైఫ్ తదితర అంశాలపైనా మాట్లాడుకున్నట్లు తెలిపింది.
కామన్వెల్త్ దేశాలు, వాటి మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారని పేర్కొంది. భారత్, బ్రిటన్ దేశాల మధ్య జీవన వారధిగా.. ద్వైపాక్షిక సంబంధాలను సుసంపన్న చేయడంలో బ్రిటన్లోని భారతీయ సమాజం పాత్రను కూడా ప్రశంసించారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోడీ కూడా ఫోన్ సంభాషణకు సంబంధించి ట్వీట్ చేశారు.
It was a pleasure to speak with His Majesty King Charles III on issues of mutual interest, including environmental protection, climate resilience, and the Commonwealth. Also discussed the priorities of India's G20 Presidency, and the potential of Mission LiFE. @RoyalFamily
— Narendra Modi (@narendramodi) January 3, 2023
కాగా, ఏడు దశాబ్దాలాపాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 గత సంవత్సరం సెప్టెంబర్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 6న కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తొలిసారి ఈరోజు బ్రిటన్ రాజుతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.