అవి చీకటి రోజులే: 3 పథకాల ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు, అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవ పథకం (అమృత్), అందరికీ ఇళ్లు( ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన) పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నగరాల్లో ఇంకా 2కోట్ల మందికి నివాసయోగ్యం లేదన అన్నారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఫుట్పాత్లు, మురికివాడల్లో కనీస వసతులు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు గృహ నిర్మాణంలో ఉన్నా.. ఇల్లు కడతారుగానీ వసతులు కల్పించలేరన్నారు.
నగర పాలికలు వసతులు ఏర్పాటు చేసినప్పుడే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏ నగరానికి ఆ నగరం స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకున్నప్పుడు సంపూర్ణ వికాసం ఉంటుందన్నారు. ప్రణాళికాలోపాల వల్లే నగరాల్లో విద్యుత్, నీరు డ్రైయినేజీ వంటి వసతులు సకాలంలో అందుబాటులోకి రాలేకపోతున్నాయన్నారు.
ఉపాధి కోసం వలసలతో పట్టణీకరణ పెరుగుతోందని, సామాన్యుడికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పట్టణ జీవన విధానంలో మార్పు తేవాలన్నదే తమ ప్రయత్నమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ పథకాలు విజయవంతం చేయాలని కోరారు. పట్టణ జనజీవన విధానం మార్పుపై అందరం కలిసి చర్చించాలని పేర్కొన్నారు.
అవి చీకటి రోజులు
40ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25, 26 తేదీలను మనం ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎమర్జెన్సీ రోజులన్నీ చీకటి రోజులేనని పేర్కొన్నారు. అత్యయిక స్థితిలో లక్షలాదిమంది జైళ్లపాలయ్యారన్నారు. పత్రికలను పూర్తిగా నియంత్రించారని, కేవలం రేడియోలో మాత్రమే ప్రభుత్వానికి అనుకూల ప్రసంగాలు వచ్చేవని మోడీ గుర్తు చేశారు.