దారుణం : ఓవైపు వ్యాక్సిన్ల కొరత- ప్రైవేటు ఆస్పత్రుల్లో స్పందన కరవు- 17 శాతమే వాడకం
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వేళ వ్యాక్సిన్ల కొరత ప్రజల్ని, ప్రభుత్వాల్ని వేధిస్తోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు, కొత్త వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు లేవు. గ్లోబల్ టెండర్లు పిలిచినా వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్ధితి. ఇంత డిమాండ్ ఉన్న పరిస్ధితుల్లో భారీ ఎత్తున కేంద్రం నుంచి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు వాటిని వాడకుండా నిల్వ చేసుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది..
కొరతలోనూ ప్రైవేటు చేతుల్లో వ్యాక్సిన్లు
దేశవ్యాప్తంగా మే నెలలో కేంద్రం తీసుకొచ్చిన వ్యాక్సిన్ల పంపిణీ విధానం ప్రకారం మొత్తం ఉత్పత్తి అయ్యే కరోనా వ్యాక్సిన్లలో 50 శాతం ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రుల గ్రూప్లు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో భారీ ఎత్తున వ్యాక్సిన్లను ఆయా ఆస్పత్రులు కొనుగోలు చేశాయి. ఓవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం భారీగా వ్యాక్సిన్లు దర్శనమిచ్చాయి. దీంతో మాకు ఇవ్వని వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా ఇస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్రాన్ని నిలదీశాయి. దీంతో ఇరకాటంలో పడిన కేంద్రం తాజాగా ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే 50 శాతం వ్యాక్సిన్లను కాస్తా 25 శాతానికి తగ్గించింది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో స్పందన కరవు
ప్రభుత్వం ఓవైపు ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేస్తున్న వేళ కార్పోరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లకు స్పందన కరవైంది. వ్యాక్సిన్లను వేలకు వేలు అమ్ముతున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్కు జనం మొగ్గు చూపడం లేదు. మరీ తప్పనిసరి అయితే తప్ప ప్రైవేటు ఆస్పత్రుల్లో జనం వ్యాక్సిన్లు వేయించుకోవడం లేదు. దీంతో దేశవ్యాప్త డిమాండ్తో భారీ ఎత్తున వ్యాక్సిన్లు సేకరించి పెట్టుకున్న ప్రైవేటు ఆస్పత్రులకు నిరాశ తప్పడం లేదు. అలాగని దీన్ని బయటికి చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లా అవి మౌనంగా ఉంటున్నాయి.
17 శాతం వ్యాక్సిన్లే వాడిన ప్రైవేటు ఆస్పత్రులు
కేంద్రంతో లాబీయింగ్ చేసి మరీ భారీ ఎత్తున వ్యాక్సిన్లను కొనుగోలు చేసి పెట్టుకున్న ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రుల గ్రూప్లు ఇప్పుడు తీసుకున్న వాటిలో ఐదో వంతు వ్యాక్సిన్లు కూడా వాడలేదనే షాకింగ్ నిజం బయటపడింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కేంద్రం మే నెలలో ఇచ్చిన కోటీ 29 లక్షల వ్యాక్సిన్ డోసుల్లో ప్రైవేటు ఆస్పత్రులు కేవలం 22 లక్షల డోసులు మాత్రమే వాడాయి. మిగిలిన కోటికి పైగా వ్యాక్సిన్ డోసులు అలాగే నిల్వ ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ప్రైవేటు ఆస్పతుల్లో వ్యాక్సిన్లపై జనం అనాసక్తి
గతంలో పోలిస్తే దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల సరఫరా క్రమంగా మెరుగుపడుతోంది. కేంద్రం రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని ఉచితంగానే ప్రజలకు వేసేందుకు చేసేందుకు సిద్దమయ్యాయి. ఇలాంటి తరుణంలో కొందరు ధనికులు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లకు మొగ్గుచూపుతున్నారు. బయట ఉచితంగా వస్తుంటే వేలకు వేలు పెట్టి ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవడమెందుకన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. దీంతో సహజంగానే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లకు స్పందన కరవవుతోంది.