ప్రద్యుమన్ హత్యలో బలిపశువును చేయబోయారు: పోలీసులపై కండక్టర్ కేసు, ఇరికించాలనే..
కేసులో తన కొడుకును ఇరికించాలని పోలీసులు ప్రయత్నించినట్టుగా అర్థమవుతోందని అశోక్ కుమార్ తండ్రి అన్నారు. అందుకే కేసును విచారించిన పోలీసులు, సిట్ బృందంపై తాము కేసు వేస్తున్నామని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: రేయాన్ ఇంటర్నేషన్ స్కూల్లో చోటు చేసుకున్న ప్రద్యుమన్ హత్య ఉదంతానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రద్యుమన్ హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి.
జరిగింది అది కాదు: ఆధారాలు ఎలా మాయం అయ్యాయ్?, ప్రద్యుమన్ హత్య వెనుక సంచలనాలు..
అసలు నిందితుడిని గుర్తించాల్సిందిపోయి.. ఆరోపణలు ఎదుర్కొన్న బస్ కండక్టర్ అశోక్ కుమార్ను ఇరికించడానికి పోలీసులు ప్రయత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నేరం ఒప్పుకోవాల్సిందిగా బలవంతం చేసి తనను బలిపశువును చేయబోయారని అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
హర్యానా పోలీసులు, యాజమాన్యంపై కేసు:
కేసును తప్పుదోవ పట్టించి తనను ఇరికించ చూశారని ఆరోపిస్తూ బస్ కండక్టర్ అశోక్ కుమార్ హర్యానా పోలీసులు, పాఠశాల యాజమాన్యంపై కేసు పెట్టాడు. అశోక్ కుమార్ తరుపు న్యాయవాది మోహిత్ కుమార్ దీనిపై స్పందించారు. అసలు నేరస్థుడిని తప్పించేందుకు పోలీసులు తన క్లయింట్ను బలిపశువు చేశారని ఆరోపించారు.
నా కొడుకును ఇరికించాలనుకున్నారు:
కేసులో తన కొడుకును ఇరికించాలని పోలీసులు ప్రయత్నించినట్టుగా అర్థమవుతోందని అశోక్ కుమార్ తండ్రి అన్నారు. అందుకే కేసును విచారించిన పోలీసులు, సిట్ బృందంపై తాము కేసు వేస్తున్నామని పేర్కొన్నారు. హత్యా నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా తన కొడుకును పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. తన కొడుకు పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
యాజమాన్యం కూడా కుమ్మక్కయిందా?
ప్రద్యుమన్ హత్య ఉదంతంలో నిందితుడిని తప్పించేందుకు రేయాన్ స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన తర్వాత ఆధారాలు మాయమవడం దీనికి బలం చేకూరుస్తోంది. యాజమాన్యం-పోలీసులు కుమ్మక్కై అసలు నిందితుడిని తప్పించి.. బస్ కండక్టర్ ను బలిపశువును చేయబోయారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
హత్య ఉదంతం:
స్కూల్లో టీచర్-పేరెంట్స్ మీటింగ్ వాయిదా వేయాలని భావించిన నిందితుడు.. ఇందుకోసం ఏం చేయాలా? అని తీవ్రంగా ఆలోచించాడు. చివరాఖరికి హత్య చేయాలని నిర్ణయించుకున్న అతను.. ప్రద్యుమన్ ను బలితీసుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు సీబీఐ కస్టడీలో ఉన్నాడు. మూడు రోజుల పాటు అధికారులు అతన్ని విచారించనున్నారు.