ముగ్గురిని చంపేశాం: నిన్నూ లేపేస్తామంటూ లేఖ
మైసూరు: "నన్ను ఎవ్వరు ఏమి చెయ్యలేరని అనుకోవద్దు, 12 సంవత్సరాల నుంచి నిన్ను గమనిస్తున్నాం, నిన్నుఅంతం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము, ఇప్పటికే మా చేతిలో ముగ్గురు రచయితలు అంతం అయ్యారు, ఇక నువ్వు రోజులు దగ్గర పెట్టుకో, నీ పని అయిపోయింది" అంటూ ఒక రచయితకు బెదిరింపు లేఖ వచ్చింది.
"నిన్ను పోలీసులు కాదు కదా ఆ దేవుడు కూడ కాపాడలేడు" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ బెదిరింపు లేఖ పంపించారు. రకంగా మైసూరు నగరంలో నివాసం ఉంటున్న ప్రొఫసర్ కే.ఎస్. భగవాన్ కు బెదిరింపు లేఖ వచ్చిందని కువెంపునగర పోలీసులు తెలిపారు.
మైసూరు నగరంలోని కువెంపు నగరంలో కే.ఎస్. భగవాన్ నివాసం ఉంటున్నారు. బుధవారం మద్యాహ్నం 12.45 గంటల సమయంలో ఆయన ఇంటికి తపాలలో ఒక ఉత్తరం వెళ్లింది. భగవాన్ కుటుంబ సభ్యులు ఆ ఉత్తరం తీసుకున్నారు.
భగవాన్ ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులు ఆ ఉత్తరం ఆయనకు అందించారు. ఆంగ్లంలో ఉన్న ఆ ఉత్తరంలో పై విధంగా బెదిరించారు. ఆంగ్లంలో టైప్ చేసి బెదిరింపు లేఖ పంపించారు. వెంటనే భగవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దారవాడలోని కల్యాణనగరలో నివాసం ఉంటున్న ప్రొఫసర్ ఎం.ఎం. కలబుర్గిని ఇటివల రివాల్వర్ తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మైసూరు నగరంలో నివాసం ఉంటున్న మరో ప్రొఫసర్ భగవాన్ ను చంపేస్తామని బెదిరించారు.
అనేక విషయాలలో భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగవద్దీతను చులకన చేస్తు వ్యాఖ్యలు చేశారు. అందు వల్లనే ఒక వర్గం వారు ఆయనను టార్గెట్ చేసుకుని బెదిరింపు లేఖ పంపించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
భగవాన్ ఇంటి దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత ప్రాంతం అయిన మైసూరులో రచయిత హత్యకు గురైతే చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. బెదిరింపు లేఖను పోలీసులకు అప్పగించారు.
భగవాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. "భగవద్దీతను అగ్నికి ఆహుతి చెయ్యాలి. నిండు గర్బిణిని అడవులకు పంపించిన శ్రీరాముడిని మీరు ఆదర్శంగా తీసుకుంటారా, 16,000 మందిని పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు పాపాత్ముడు" అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.