ఘోర ప్రమాదం: ట్రాన్స్ఫార్మర్ పేలి 14మంది మృతి
రాజస్థాన్ రాజధాని జైపూర్కు సమీపంలోని కథులియా గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పేలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది.
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్కు సమీపంలోని కథులియా గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పేలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. కథులియా గ్రామానికి చెందిన ఓ ఇంట్లో వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా కొంతమంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడిన మరో 20మందిని షాపురా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో 9మంది మృత్యువాతపడ్డారు. మిగిలిన క్షతగాత్రులను జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పుష్పేంద్ర సింగ్ ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆ రాష్ట్ర సీఎం వసుంధర రాజే పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.