ఛార్జీల బాదుడుపై పునరాలోచించండి: బ్యాంకులకు కేంద్రం సూచన
ఖాతాదారులకు అదనపు రుసుముల వడ్డింపునకు పలు బ్యాంకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై పునరాలోచించాల్సిందిగా అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఖాతాదారుల నుంచి పలు విధాలుగా ఛార్జీలు వసూలు చేసేందుకు పలు బ్యాంకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై పునరాలోచించాల్సిందిగా అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది.
సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోవతే అపరాధ రుసుముతోపాటు సేవా పన్నును ఏప్రిల్ 1 నుంచి వసూలు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంకు నాలుగు మించి లావాదేవీలు జరిపితే రూ.150 చొప్పున రుసుము వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో నడిచేందుకు మిగిలిన బ్యాంకులు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బ్యాంకులు, ఏటీఎంల ద్వారా మూడు, నాలుగుకు మించిన నగదు లావాదేవీలపై అదనపు రుసుములు విధించనున్నట్లు పలు ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బ్యాంకుల తీరుపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.