దీదీకి ఎదురుదెబ్బ: శారదా స్కాంలో టిఎంసి ఎంపి అరెస్ట్
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శ్రీంజోయ్ బోస్ను కోల్కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. శారదా చిట్ఫండ్స్ కుంభకోణంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. బోస్కు సంబంధించిన మీడియా సంస్థకు ఈ కుంభకోణంతో లింకు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
ఎంపి బోస్ తన వ్యాఖ్యలతో తమ విచారణను తప్పుదారి పట్టిస్తున్నారని, అతను తెలిపిన వివరాలు తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు సరిపోవడం లేదని సిబిఐ వెల్లడించింది. శారదా స్కాంలో ప్రధాన నిందితుడైన సుదిప్తో సేన్ నుంచి బోస్ ప్రతీ నెలా రూ. 60లక్షలను పొందారనే ఆరోపణలున్నాయి.
అంతకుముందు శారద చిట్ఫండ్స్ కుంభకోణం విచారణలో భాగంగా ప్రత్యేక క్రైం బ్రాంచ్ సమన్లు అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సిబిఐ ముందు హాజరయ్యారు. బెంగాల్ రవాణాశాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ శుక్రవారం ఉదయం సీబీఐ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లారు. తృణమూల్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బోస్ కూడా హాజరయ్యారు.
శ్రీంజోయ్ బోస్ను సీబీఐ గతంలో రెండుసార్లు ప్రశ్నించింది. శుక్రవారం మరోసారి సీబీఐ ముందు ఆయన హాజరయ్యారు. సమన్లు అందుకున్న మరో నాయకుడు మదన్ మిత్రా అనారోగ్య కారణాలు చెబుతూ ఆస్పత్రిలో చేరారు.
ఈ ముగ్గురితోపాటు ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ తృణమూల్ నాయకుడుకు సోమర్ మిత్రాకు గురువారం రాత్రి సీబీఐ తాకీదులు జారీ చేసింది. తనకు ఇంకా సమన్లు అందలేదని, అందిన వెంటనే సీబీఐ ఎదుట హాజరవుతానని ఆయన చెప్పారు. సీబీఐ సమన్లు అందినంత మాత్రాన వారు నిందితులు కాదంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు మమత బెనర్జీ సమర్ధించుకున్నారు.