శశికళ శపథం ఎవరిపై?.. జైలు నుంచే వ్యూహా రచనకు ప్లాన్!, చిత్తయ్యేదెవరు?
జైలు నుంచే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తానని, తన ఎత్తుగడలను అమలు చేయాలని శశికళ వారితో పేర్కొనట్లు చెబుతున్నారు.
చెన్నై: నాలుగు వారాల గడువు కోసం శశికళ చేసిన అప్పీల్ ను సైతం సుప్రీం తోసిపుచ్చడంతో.. చేసేదేమి లేక శశికళ జైలు బాట పట్టారు. కర్ణాటక కోర్టులో లొంగిపోయేందుకు బయలుదేరిన శశికళ అంతకుముందు మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు.
నివాళి అర్పించే సమయంలో శశికళ తీవ్ర ఆగ్రహావేశానికి లోనైనట్టు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. జయకు నివాళి అర్పిస్తున్న సమయంలో తన చేత్తో మూడుసార్లు సమాధిపై కొట్టి శశికళ శపథం పూనారు. శశికళ ఎవరిపై శపథం పూనారన్నది ఆమె అంతరంగానికే తెలియాలి.

అయితే ఆపద్దర్మ సీఎంగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం, వెనుక ఉండి ఆయన్ను నడిపిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ, డీఎంకెల పైనే శశికళ కసిగా శపథం చేశారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కుట్రపూరితంగా తనను జైలుకు పంపించినవారి ఆట కట్టించేందుకు అక్కడి నుంచే చిన్నమ్మ తన వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే విషయాన్ని అన్నాడీఎంకె నేతలతో సైతం శశికళ చెప్పినట్టుగా సమాచారం. జైలు నుంచే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తానని, తన ఎత్తుగడలను అమలు చేయాలని శశికళ వారితో పేర్కొనట్లు చెబుతున్నారు. ఏదేమైనా శశికళ అంత రౌద్రంగా శపథం చేయడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్ముందు శశికళ వేసే ఎత్తుగడలకు ఎవరు చిత్తవుతారన్నది వేచిచూడాలి.












Click it and Unblock the Notifications