ఆధార్: సుప్రీంకోర్టులో మమతకు ఎదురుదెబ్బ, కేంద్రానికి నోటీసులు
ఆధార్ అనుసంధానంపై పిటిషన్ విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానంపై పిటిషన్ విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు పిటిషన్ ఎలా వేస్తాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించింది
ఇటీవల పలు సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది కపిల్ సిబాల్ హాజరై వాదనలు వినిపించారు. అయితే ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆదేశాలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని సూచించింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యక్తులు పిటిషన్ వేయొచ్చు గానీ.. రాష్ట్రాలు వేయకూడదని స్పష్టం చేసింది. మమతాబెనర్జీ వ్యక్తిగతంగా పిటిషన్ వేస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.
కేంద్రానికి నోటీసులు
అదేవిధంగా మొబైల్ నంబర్కు ఆధార్ను అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేసిన మరో పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. అనంతరం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్రం తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. అటు టెలికాం ఆపరేటర్లను కూడా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.