ఎన్కౌంటర్లపై వివరణ ఇవ్వండి... సుప్రీం కోర్టు ఆదేశం
ఉత్తర్ ప్రదేశ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు యోగీ సర్కార్ను కోరింది. ఎన్కౌంటర్లపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ విచారణ జరపాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది..
పిటిషనర్ తరపున కేసును వాదించిన న్యాయవాది సంజయ్ పారిక్ రాష్ట్రంలో 1000 ఎన్కౌంటర్లు జరగగా అందులో 58 మంది చనిపోయారని కోర్టుకు తెలిపారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు యోగీ సర్కార్కు సుప్రీం కోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్పై పలు వ్యాఖ్యలు చేశారని వాటిపై తమకు అనుమానంగా ఉందంటూ కోర్టుకు తెలిపాడు పిటిషనర్. యోగీ వ్యాఖ్యలను పరిశీలించిన జాతీయమానవ హక్కుల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు.
ఈ ఎన్కౌంటర్లపై సీబీఐతో గానీ సిట్తో కానీ విచారణ చేయించాలని కోరారు. అయితే విచారణాధికారులు యూపీ రాష్ట్రంలో పనిచేసి ఉండని వారై ఉండాలని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. అంతేకాదు విచారణ తీరును కోర్టు ఎప్పిటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని, లేదా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కేసు విచారణ తీరును సమీక్షించేందుకు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేలా యోగీ సర్కార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.