ఉప రాష్ట్రపతి ఎన్నికకు నగారా - వెంకయ్య కొనసాగేనా : రేసులో ఎవరెవరు..!!
ఒక వైపు రాష్ట్రపతి ఎన్నిక కసరత్తు జరుగుతున్న వేళ..కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల జూలై 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఇక, పోలింగ్ ఆగస్టు 6న జరగనుంది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తరువాత ఆ వెంటనే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం మొత్తం 788 మంది తమ ఓట హక్కు వినియోగించు కోనున్నారు. అందులో 233 మంది రాజ్యసభ సభ్యులు... 543 మంది లోక్ సభ సభ్యులు ఉండగా.. 12 బంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు.

ముగియనున్న వెంకయ్య పదవీ కాలం
ఇక, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీ వరకు ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్య నాయుడుకు మరో విడత అవకాశం దక్కుతుందా లేదా అనేది సందేహంగా మారుతోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏ అభ్యర్ధిగా గిరిజిన మహిళను ఎంపిక చేయటంతో..ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మైనార్టీ లేదా ఎస్సీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో ప్రధానంగా తొలి వరుసలో బీజేపీ సీనియర్ నేత..ముక్తార్ అబ్బాస్ నక్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా, ఆయనకు రాజ్యసభ రెన్యువల్ కూడా దక్కలేదు. ఉప రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రాజ్యసభ ఛైర్మన్ గానూ వ్యవహరించాల్సి ఉంటుంది.

రేసులో ప్రధానంగా నక్వీ పేరు
రాజ్యసభలో లెక్కలు అధికారిక ఎన్డీఏకు కీలకంగా మారటంతో గతంలో వెంకయ్య నాయుడుని ఆ హోదాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, ఇప్పుడు సామాజిక సమీకరణాలలో భాగంగా మైనార్టీకి ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. మరో పేరు ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ గా ఉన్న తావార్ చంద్ గెహ్లాట్ పేరు సైతం రేసులో ఉంది. ఆయన ఎస్సీ వర్గానికి చెందిన నేత. ఎస్టీ వర్గానికి రాష్ట్రపతి - ఎస్సీ వర్గానికి ఉప రాష్ట్రపతి ఇవ్వాలని భావిస్తే ఆయన పేరు ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. మైనార్టీ కోటాలో కేరళ గవర్నర్ పేరు సైతం ప్రచారంలో ఉంది. కానీ, బీజేపీ అధినాయకత్వం ముక్తార్ అబ్బాస్ నక్వీ పేరు పైన ఆసక్తిగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

విపక్షాలు దక్షిణాది వైపు చూపు
దీంతో.. ఇప్పుడు నక్వీ పేరు ఖరారు చేస్తే.. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుకు మరో అవకాశం లేనట్లుగానే భావించాలి. ఇక, ఎన్డీఏ అభ్యర్ది పేరు దాదాపుగా ఖరారు అయిందని భావిస్తున్న ఈ సమయంలో.. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలు తమ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ఎవరి పేరు తెర మీదకు తీసుకొస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. దక్షిణాది నుంచి ఎంపిక చేసి.. వ్యూహాత్మకంగా బీజేపీని ఇరకాటంలోని నెట్టే ప్రయత్నాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక పైనా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications